
హైదరాబాద్: ఆసియా ఛాంపియన్షిప్లో భారత షూటర్ దీపక్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన పదో ఆటగాడిగా నిలిచాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న 14వ ఆసియా ఛాంపియన్షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్ ఈవెంట్లో 227.8 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
దీపక్ కుమార్ గతేడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్లో కూడా కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. 626.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. రైఫిల్, పిస్టల్ విభాగాల్లో ఇప్పటికే భారత్ తొమ్మిది మంది టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. భారత్ నుంచి ఎంతో అనుభవం కలిగిన ముగ్గురు షూటర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం విశేషం.
ఏప్రిల్లో దివ్యన్ష్ సింగ్ పన్వర్ తర్వాత టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన రెండో భారత షూటర్గా దీపక్ కుమార్ నిలిచాడు. ఇక, ఆసియా నుంచి చైనా (25), కొరియా (12), జపాన్ (12) షూటర్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
మంగళవారం దోహా వేదికగా ప్రారంభమైన ఆసియా ఛాంపియన్షిప్లో భారత్ తరఫున పురుషుల విభాగంలో 63, మహిళల విభాగంలో 45 మంది బరిలోకి దిగుతున్నారు. వీరంతా కూడా రైఫిల్, పిస్టల్, షాట్గన్ విభాగాల్లో పోటీ పడుతున్నారు.