
హైదరాబాద్: వింటర్ ఒలింపిక్స్కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరం అన్ని విధాలా సిద్ధమైంది. శుక్రవారం ప్యాంగ్చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో వింటర్ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్లో 92 దేశాలకు చెందిన 2,952 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.
ఈ ఒలింపిక్స్లో భారత్ ఇద్దరు సభ్యుల జట్టుతో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. భారత్ నుంచి శివ్కేశవన్, జగదీష్లు బరిలోకి దిగుతున్నారు. లుజ్లో కేశవన్, క్రాస్ కంట్రీ స్కీయింగ్లో జగదీష్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్ లుజ్ హీట్స్ ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో జరుగుతాయి. ఇక, జగదీష్ పోటీపడే 15 కిమీ నోర్దిక్ స్కీయింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫిబ్రవరి 16న జరుగుతుంది.
36 ఏళ్ల శివ కేశవన్ ఆరోసారి వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు దక్షిణ కొరియా బయలుదేరడానికి ముందు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో తన కెరీర్లో పాల్గొనబోయే చివరి ఒలింపిక్స్ ఇదేనని పేర్కొన్నాడు. సుమారు 22 సంవత్సరాలు భారత్కు ప్రాతినిథ్యం వహించానని, ప్యాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలుకుతానని అన్నాడు.
2014 సోచీ వింటర్ ఒలింపిక్స్లో కొంత మంది 46 ఏళ్ల వయసులోనూ పతకాలు సాధించారని, ఆ రకంగా చూస్తే తాను మరికొంత కాలం కెరీర్ను కొనసాగించొచ్చని తెలిపాడు. అయితే ఇతర బాధ్యతలు దృష్ట్యా ఈ ప్యాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ పోటీల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశాడు.
కేశవన్ తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఇటాలియన్. మనాలీలో పుట్టి పెరిగిన అతనికి చిన్నప్పటి నుంచి ల్యూగ్పై ఆసక్తి పెంచుకున్నాడు. 1998లో తొలిసారి వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఆసియా ల్యూగ్ చాంపియన్షిప్ను 2011, 2012, 2016, 2017 సంవత్సరాల్లో గెల్చుకుని చరిత్ర సృష్టించాడు.
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం లేదా ముగింపు సమయంలో భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని మార్చ్పాస్ట్లో పాల్గొనడం తనకు గర్వంగా ఉంటుందని అన్నాడు. ల్యూగ్ వంటి క్రీడలపై యువతరం ఆసక్తి పెంచుకుంటున్నారని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే సత్తా ఉన్న వారు ఎంతో మంది దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని అన్నాడు.