ముంబై: కొచ్చి కన్సార్షియం ఫ్రాంచైజీ బిడ్ లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ కు రహస్య ఎజెండా ఉందని ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీ వ్యాఖ్యానించారు. శుక్రవారం థరూర్, మోడీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాళ్లు వివాదం సృష్టించాలని అనుకుంటున్నారని, తాము ఇక్కడే ఉంటామని, రహస్య ఎజెండాలతో సంబంధం లేకుండా తాము మంచి పనులు చేస్తూ పోతామని ఆయన అన్నారు. థరూర్ కు భిన్నమైన ఎజెండా ఉందని, దాన్ని అడ్డుకుంటామని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన కొచ్చి ఐపియల్ ప్రాంచైజీని దుబాయ్ కు తరలించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలను సాగనివ్వబోమని ఆయన అన్నారు. ఏ జట్టు కూడా భారత్ వెలుపల ఆడేందుకు అనుమతించబోమని ఆయన అన్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయాలని తాను పెట్టుబడిదారులపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఎవరిపైనా ఒత్తిడి పెట్టలేదని ఆయన అన్నారు.