75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను గురువారం ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందిని ఎంపిక చేసింది. వీరిలో అయిదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందించినందకు ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.
ఇటీవల చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు పద్మశ్రీ అవార్డు దక్కింది. అత్యంత పెద్ద వయసులో డబుల్స్ నంబర్వన్ ర్యాంకు సాధించిన ఆటగాడిగా 43 ఏళ్ల బోపన్న రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ ఫైనల్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో చైనా జంట మచాక్, జాంగ్ జిజెన్పై 6-3, 3-6, 7-6 (10-7) బోపన్న-ఎబ్డెన్ జోడీ ఘన విజయం సాధించింది. కాగా, రెండు దశాబ్దాలకు పైగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బోపన్న ఆసియా క్రీడల్లో ఓ డబుల్స్, ఓ మిక్స్డ్ డబుల్స్ స్వర్ణం గెలుచుకున్నాడు.

స్క్వాష్ స్టార్ ప్లేయర్ జోష్న చిన్నప్పకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. భారత్ తరపున ఆమె ఎన్నో పతకాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్లో డబుల్స్లో ఒక స్వర్ణం, ఒక రజతం గెలిచింది. ఏషియన్ గేమ్స్లో టీమ్ విభాగంలో రెండు రజతాలు, రెండు కాంస్యాలు, సింగిల్స్లో ఓ కాంస్యం గెలుచుకుని సత్తాచాటింది. అంతేగాక 2022 వరల్డ్ ఛాంపియన్షిప్లో డబుల్స్లో స్వర్ణం సాధించి రికార్డులకెక్కింది. ఆమెతో పాటు హర్బిందర్ సింగ్ (హాకీ), పూర్ణిమ మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (పారా స్విమ్మర్), గౌరవ్ ఖన్నా (పారా బ్యాడ్మింటన్ కోచ్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్పాండే (మల్లఖంబ కోచ్) పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
క్రీడల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు - 2024:
ఆర్.ఎం.బోపన్న - కర్ణాటక
జోష్న చిన్నప్ప - తమిళనాడు
ఉదయ్ విశ్వనాథ్ దేశ్పాండే - మహారాష్ట్ర
గౌరవ్ ఖన్నా - ఉత్తర్ప్రదేశ్
సతేంద్ర సింగ్ లోహియా - మధ్యప్రదేశ్
పూర్ణిమా మహతో - జార్ఖండ్
హర్బీందర్ సింగ్ - ఢిల్లీ