
హైదరాబాద్: పోల్ వాల్ట్లో తమిళనాడుకు చెందిన సుబ్రమణి శివ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 22వ ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్ సీనియర్ ఛాంపియన్షిప్లో పురుషుల పోల్ వాల్ట్లో 5.15 మీటర్ల దూరం ఎగిరిన శివ తన రికార్డుని తానే అధిగమించాడు. గతంలో శివ 5.14 మీటర్లు ఎగిరి రికార్డుని నెలకొల్పాడు.
భారత ఆర్మీలో హవాల్దర్గా పనిచేస్తోన్న 21 ఏళ్ల శివ రికార్డు సృష్టించి స్వర్ణం గెలిచినప్పటికీ కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించలేకపోయాడు. కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించాలంటే కనీసం 5.45 మీటర్లు ఎగరాల్సి ఉంటుంది. ఈవెంట్ అనంతరం శివ మాట్లాడుతూ 'గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. ప్రాక్టీస్లో 5.40 మీటర్ల దూరం ఎగిరా. మంచి ఫిట్నెస్ ఉండింటే క్వాలిఫయింగ్ మార్కును అందుకునేవాడినేమో' అని శివ చెప్పాడు.

మరోవైపు భారత డిస్కస్ త్రో స్టార్ సీమా పునియా కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించింది. కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించాలంటే 59 మీటర్లను అర్హత మార్కుగా పెట్టారు. అయితే ఆఖరి రౌండ్లో 61.05 మీటర్లు డిస్క్ను విసిరిన సీమ పునియా రికార్డు సృష్టించడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించింది.
గత రెండేళ్లలో సీమా పునియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2006 నుంచి సీమ కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధిస్తూనే ఉంది. 2006 కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలిచిన సీమ.. 2010 క్రీడల్లో కాంస్యం, గతేడాది జరిగిన గేమ్స్లో రజతం నెగ్గింది. 57.75 మీటర్లు విసిరిన నవజీత్ కౌర్... పునియా తర్వాతి స్థానంలో నిలిచింది.
ఇక, మహిళల 5 వేల మీటర్ల పరుగులో సూరియా 15:46.96 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి స్వర్ణం సాధించింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ అర్హత మార్కు (15:09.00 ని) అందుకోవడంలో విఫలమైంది. హ్యామర్ త్రోలో జాతీయ రికార్డు హోల్డర్ సరితా దేవికీ ఇదే పరిస్థితి ఎదురైంది. హ్యామర్ను 63.80 మీటర్లు విసిరినప్పటికీ, కామన్వెల్త్ గేమ్స్ అర్హత మార్కు (68.32 మీ) అందుకోలేక పోయింది.