చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సేవ్ సిఎస్కే ప్రచారాన్ని ప్రారంభించారు. జట్టు పైన రెండేళ్ల పాటు వేటు వేయాలన్ని లోథా కమిటీ తీర్పును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చెన్నై జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. జూలై 14వ తేదీన రాజస్థాన్ జట్టుతో పాటు చెన్నై జట్టు పైన రెండేళ్ల పాటు నిషేధం విధించాలని లోథా కమిటీ సూచించింది.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.. చెన్నై జట్టుపై వేటును ఉపసంహరించుకోవాలని కంపెయిన్ ప్రారంభించారు. అభిమానులు అందరూ ఆగస్టు 1వ తేదీన (శనివారం) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భేటీ కావాలని నిర్ణయించారు.

చెన్నై జట్టు పైన వేటును ఉపసంహరించుకోవాలని బిసిసిఐకి విజ్ఞప్తి చేయనున్నారు. వారు సంతకాలు సేకరించి బిసిసిఐకి ఇవ్వనున్నారు.
ఐపిఎల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. లోథా కమిటి తీర్పు పైన వారు అసంతృప్తితో ఉన్నారు. దీంతో, సేవ్ సిఎస్కే పేరుతో ఫేస్బుక్ పేజీతో బుధవారం నాడు కంపెయిన్ ప్రారంభించారు. ఫేస్బుక్ పేజీ ప్రకారం ఇప్పటికే 6వేల మంది వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.