టోక్యో: ఒలింపిక్స్ 2021లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా విభాగాల్లో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. టేబుల్ టెన్నిస్లోనూ ఆ దిశగా వెళుతోంది. మెన్స్ సింగిల్స్లో భారత్కు చెందిన జ్ఞానేశ్వరన్ సత్యన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాడు, హాంకాంగ్కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో అతడు ఓడిపోయాడు.
టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జ్ఞానేశ్వరన్ సత్యన్ పోరాడి ఓడాడు. తొలి గేమ్ 7-11తో కోల్పోయినా.. అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు గేమ్స్ గెలిచాడు. దీంతో మ్యాచ్పై అతడు ఆశలు రేపాడు. ఇక విజయం ఖాయం అనుకున్నారు అందరూ. ఇక్కడే లామ్ సియు హాంగ్ తన ప్రతాపాన్ని చూపాడు. వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచును 3-4 తేడాతో గెలుచుకున్నాడు. ఈ ఓటమితో జ్ఞానేశ్వరన్ ఇంటిదారిపట్టాడు.
టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొన్న భారత ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంచనాలను అందుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్లో పశ్చిమ బెంగాల్కు చెందిన 26 ఏళ్ల ప్రణతి పూర్తిగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పోటీలో నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు మాత్రమే చేసింది. దీంతో 29వ స్థానంలో నిలిచి.. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీల ఆల్ రౌండ్ ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. టాప్ 24 జిమ్నాస్ట్లు మాత్రమే ఫైనల్కు అర్హత సాధించారు. జూలై 29న ఫైనల్స్ జరగనున్నాయి.
మరోవైపు భారత పురుష షూటర్లు ఆదివారం నిరాశపరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ రౌండ్లో ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయారు. దీపక్ కుమార్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో, పన్వర్ దివ్యాంశ్ సింగ్ 622.8 పాయింట్లతో 32వ స్థానంలో నిలచాడు. దీంతో ఈ విభాగంలో భారత్ కథ ముగిసింది.
Tokyo Olympics 2021: ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఆస్ట్రేలియా!!