కౌలాలంపూర్: ఆసియా క్రీడల్లో కాంస్య పతకం స్వీకరించకుండా నిరసన వ్యక్తం చేసిన భారత బాక్సర్కు కఠిన శిక్ష తప్పదని ఎఐబిఎ బుధవారం స్పష్టం చేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన లైట్ వెయిట్ పోటీ సెమీ పైనల్లో సరితా దేవి ఓటమి పాలైంది. నిరసనగా తన పతకాన్ని తన ప్రత్యర్థికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ నిరసన వ్యక్తం చేసింది.
దాంతో సరితాదేవిపై, ముగ్గురు కోచ్లపై నిషేధం వేటు పడింది. దాంతో దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ మహిళల చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం సరితకు లేకుండా పోయింది. తుది నిర్ణయానికి క్రమశిక్షణా కమిషన్కు ఎఐబిఎ నివేదించింది. కమిషన్ ఆదేశాలను త్వరలోనే ఇస్తుందని, కఠిన శిక్ష తప్పదని ఎఐబిఎ అద్యక్షుడు సికె వూ అన్నారు.

దక్షిణ కొరియాలోని జెజూ నుంచి పిటిఐ వార్తా సంస్థతో ఫోన్లో వూ మాట్లాడారు. ఆమెకు కఠిన శిక్ష పడాల్సిందేనని, సహించాల్సిన అవసరం లేదని ఆయన అనన్ారు. విజయాన్ని స్వీకరించినప్పుడు ఓటమిని కూడా స్వీకరించాలని, ప్రతి ఒక్కరూ ఆమెలాగే ప్రవర్తిస్తే పోటీలకు అర్థం ఉండదని అన్నారు.
అయితే, సరితా దేవిని శిక్ష నుంచి మినహాయించాలని బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా ఎఐబిఎను కోరారు. ఉద్వేగానికి లోనై సరిత అలా చేసిందని, అది పథకం ప్రకారం చేసిన పని కాదని ఆయన ఎఐబిఎకు విన్నవించారు.
సరిత ప్రవర్తన ప్రవర్తనా నియామవళికి విరుద్ధమేనని, అయితే ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పిందని ఆయన చెప్పారు. అయితే, వూ అందుకు అంగీకరించలేదు. క్షమాపణ అనేది విషయం కాదని, ఓ పనిచేయడానికి ముందు ఆలోచన ఉండాలని అన్నారు.