ఇస్లామాబాద్: క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు క్రికెటర్లతో పాటు వారి భార్యలను, ప్రియురాళ్లను వారితో పంపించాలా వద్దా అనే దాని పైన ఇటీవలి కాలంలో విస్తృత చర్చ సాగుతోంది. మ్యాచ్ల సందర్భంగా భారత క్రికెటర్ల భార్యలు స్టేడియంలో ఆనందిస్తున్నారు. విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ కూడా గతంలో స్టేడియాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లను ఆటగాళ్లతో పంపించే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ ఓ బాంబు పేల్చాడు.
1999లో ప్రపంచకప్ సమయంలో తాను తన భార్యతో కలిసి హోటల్ గదిలో ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడని వార్తలు వస్తున్నాయి. నాడు ప్రపంచకప్ సమయంలో తాము తమ భార్యలతో కలిసి ఉన్నామని, అయితే, సెమీ ఫైనల్కు ముందు బోర్డు భార్యలను అనుమతించలేదని ముస్తాక్ చెప్పాడు.

అయితే, తాను మాత్రం తన భార్యతో ఉండమని చెప్పానన్నాడు. 'నేను నిన్ను ఇంటికి పంపించడం లేదు. నీవు ఉన్నప్పటికీ నాకు కంపోర్టబుల్గానే ఉంది. నీవు ఇక్కడే ఉంటున్నావు' అని నేను నా భార్యతో చెప్పానని అన్నాడు.
తాను ఎవరికి తెలియకుండా తాను తన హోటల్ గదిలోనే ఆమెను ఉంచానని, జట్టు మేనేజర్ లేదా కోచ్ వచ్చి చూసినప్పుడు తన భార్య కప్ బోర్డులో దాచుకునేదని చెప్పాడు.
క్రైస్ట్ చర్చ్లో జరుగుతున్న టెస్ట్ సమయంలో తన భార్య తనకు ఓ సందేశం పంపించిందని.. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే హాఫ్ సెంచరీ చేయాలని చెప్పిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత మరిన్ని పరుగుల కోసం మరో సందేశం పంపించిందని చెప్పాడు.