
న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు ఊరట లభించింది. ఆమెపై పడ్డ డోపింగ్ మచ్చ తొలగిపోయింది. శాంపిల్ విషయంలో జరిగిన పొరబాటు కారణంగా ఆమెపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) బుధవారం ఎత్తివేసింది. వాడా సిఫారసుల మేరకు అంతర్జాతీయ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది.
ఏ తప్పు చేయలేదని చెప్పినప్పటికీ డోపింగ్ పేరుతో తనను మానసిక క్షోభకు గురి చేశారని, దానికి తగిన మూల్యం చెల్లించాలని ఐడబ్ల్యూఎఫ్ను సంజీత చాను డిమాండ్ చేసింది. 'డోపింగ్ వివాదం నుంచి బయటపడ్డందుకు ఆనందంగా ఉంది. కానీ దాని వల్ల నేను కోల్పోయిన అవకాశాల మాటేమిటి, నాకు జరిగిన మానసిక గాయాన్ని ఎవరు నయం చేస్తారు, శాంపిల్ను పరీక్షించే క్రమంలో ప్రతి దశలోనూ జరిగిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించింది.
'తుది నిర్ణయం వెలువడకముందే ఓ అథ్లెట్పై నిషేధం విధించి ఇప్పుడు ఎలాంటి శిక్ష లేదంటూ ఈ మెయిల్ ద్వారా చెప్తారా?. ఇదేమన్నా నవ్వులాటనా?. ఓ అథ్లెట్ జీవితం గురించి ఐడబ్ల్యూఎఫ్ పట్టించుకోదా?. నా ఒలింపిక్ అవకాశాలను నాశనం చేయాలనే ఇలా చేశారా. ఐడబ్ల్యూఎఫ్ నాకు క్షమాపణ చెప్పాలి. నాకు తగిన పరిహారం అందించాలి' అని 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన చాను ఆగ్రహం వ్యక్తం చేసింది.
2017 నవంబర్లో అమెరికాలో జరిగిన ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ముందు సంజీత చాను నుంచి సేకరించిన శాంపిల్లో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు యుఎస్ డోపింగ్ నిరోధక సంస్థ పరీక్షలో తేలింది. 'బి' శాంపిల్ కూడా పాజిటివ్గా రావడంతో 2018 మేలో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని రద్దు చేశారు. ఆ శాంపిల్కు రెండు నంబర్లు కేటాయించడంతో స్పష్టత కరవై ఆమెపై ఎలాంటి చర్యలు లేవని తాజాగా ప్రకటించారు.