న్యూఢిల్లీ: బ్రెజిల్లోని రియోడిజెనిరియాలో జరిగే ఒలింపిక్స్కు భారత్ జట్టుకు గుడ్విల్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ ఎంపిక అంశంపై దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంపై సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. మిల్కా సింగ్ వంటి వారి పేరు బాలీవుడ్ సినిమాల ద్వారా మరింత ప్రచారం జరిగిందన్నారు.
సలీం ఖాన్ మిల్కాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మిల్కాజీ.. ఇది కేవలం బాలీవుడ్ కాదు. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ సినిమా రంగం. మీ పాపులారిటీ చెరిగిపోతున్న సమయంలో మీపై తీసిన సినిమానే మీకు మళ్లీ గుర్తింపు ఇచ్చింది' అని సలీం ట్విట్టర్లో పేర్కొన్నారు.
దానికి మిల్కా సింగ్ కూడా ధీటుగానే స్పందించారు. సినిమా తీసినంత మాత్రాన తనకు ఒరిగిందేమీ లేదని, అయినా ఈ విషయమై నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదని, నేను చెప్పదల్చుకున్నది.. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశం తరఫున పాల్గొనే షూటర్స్, రెజ్లర్స్, బాక్సర్లు అందరూ మన రాయబారులేనని, ఇక వేరే రాయబారి అవసరమేముందనేది తన అభిప్రాయం అన్నారు.
ఒకవేళ కావాలనుకుంటే క్రీడా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, పీటీ ఉషలాంటి వారున్న దేశంలో సంబంధంలేని రంగం నుంచి రాయబారిని ఎంపిక చేయడంలో అర్ధం లేదని మిల్కా సింగ్ సమాధానం ఇచ్చారు. కొందరు సల్మాన్కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.