న్యూఢిల్లీ: భారత్కు రియో ఒలింపిక్స్లో తొలి పతకాన్ని అందించి దేశ కీర్తిని ఇనుమడింపజేసిన రెజ్లర్ సాక్షి మాలిక్.. పెళ్లి గురించిన సంగతులు గత కొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా, సాక్షి ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయం చెప్పినా.. తనకు కాబోయే భర్త ఎవరన్నదానిపై మాత్రం స్పష్టం ఇవ్వలేదు. దీంతో ఆ లక్కీ ఫెలో ఎవరన్నదానిపై చర్చలు జోరందుకున్నాయి.
సీక్రెట్: త్వరలో ప్రియుడితోనే సాక్షి మాలిక్ పెళ్లి!
కాగా, ఈ రహస్యానికి ఆమె సోదరుడు సచిన్ తెరదించాడు. ఎన్నాళ్లీ దాపరికం అనుకున్నాడేమో గానీ సాక్షికి కాబోయే భర్త ఎవరన్న విషయంపై స్పష్టత ఇచ్చేశాడు. ఆమెకు కాబోయే భర్త 'సాక్షి సొంతూరు రోహ్తక్కు చెందిన అంతర్జాతీయ రెజ్లర్ సత్యవర్త్ కడియన్' అని సచిన్ చెప్పకనే చెప్పేశాడు.

కాగా, సత్యవర్త్ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు కూడా గెలిచాడు. సత్యవర్త్(22) కన్నా సాక్షి(24) రెండేళ్లు పెద్దది కావడం గమనార్హం. ఇద్దరూ ఇష్టపడ్డాక అదేం పెద్ద అడ్డు కాదు కదా!. కాగా, రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు సాక్షి బ్రెజిల్ వెళ్లకముందే వీరి పెళ్లి నిశ్చయమైనట్లు సచిన్ తెలిపాడు.
ఇక సత్యవర్త్ విషయానికొస్తే.. అతడు రెజ్లర్ల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి సత్యవన్ కూడా ప్రముఖ రెజ్లర్. రోహ్తక్ లో ఓ అకాడమీని ఆయన నడుపుతున్నాడు. సాక్షి, సత్యవర్త్ వివాహం చేసుకుంటారని సత్యవన్ కూడా ధృవీకరించారు.
రోహ్తక్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్గా సాక్షి

రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్ను హర్యానా ప్రభుత్వం రోహ్తక్ మహర్షి దయానంద్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్ గా నియమించింది. అంతేగాక, ఆమెకు క్రీడల మంత్రిత్వ శాఖ తరపున రూ. 21లక్షల నగదు, 500 గజాల స్థలం కూడా ఇస్తున్నట్లు మంత్రి అనిల్ విజ్ తెలిపారు. సాక్షి కోచ్ మన్దీప్కు పదోన్నతి లభించింది. సాక్షికి హర్యానా ప్రభుత్వం ఇప్పటికే రూ.2.5కోట్ల నజరానా అందించిన విషయం తెలిసిందే.