హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా గేమ్స్లో పతకం గురించి కాదు.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కృషి చేస్తానని భారత అగ్రశ్రేణి సాక్షి మాలిక్ అంటోంది. దాంతో పాటు ఆమె పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ పతకం గెలవడానికే ప్రయత్నిస్తానని, విజయంతో తిరిగొస్తే మనల్ని ఎవరూ వేలెత్తి చూపడానికి వీలుండదని భారత అగ్రశ్రేణి రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది.
'బరిలో దిగిన ప్రతిసారి పతకం గెలవాలనే అనుకుంటాం. ఒట్టి చేతులతో తిరిగి వస్తే ప్రజల నుంచి ఎదురయ్యే పరిణామాలు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో.. మాకు మాత్రమే తెలుసు. వాళ్లు ఆడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడం కష్టంగా ఉంటుంది. ఎవరు మనల్ని వేలెత్తి చూపకుండా ఉండేందుకు గాను మేం మంచి ప్రదర్శన చేయాలనుకుంటాం. రియో ఒలింపిక్స్ తర్వాత చాలా ఛాంపియన్షిప్స్లో బాగానే రాణించా. ప్రతి అథ్లెట్ జీవితంలో ఒడుదొడుకులు ఉంటాయి' అని సాక్షి తెలిపింది.
యాసర్ డోగు టోర్నీలో అర్హత రౌండ్లో విజయం సాధించిన ఆమె ఆ తర్వాతి రౌండ్లోనే ఓడింది. 'కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ అది జరగలేదు. ఆసియా క్రీడల్లో పతకం రంగు గురించి ఆలోచించకుండా నా పూర్తిస్థాయి ప్రదర్శన కనబరచాలని అనుకుంటున్నా. అభిమానులు నా నుంచి పతకం ఆశిస్తారని తెలుసు' అని సాక్షి పేర్కొంది.
గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన సాక్షి.. తాజాగా జరిగిన యాసర్ డోంగు అంతర్జాతీయ టోర్నీలో విఫలమైంది. వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా సాక్షితో పాటు సుశీల్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలకు ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇచ్చి నేరుగా క్రీడలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాక్షి, సుశీల్ ఫామ్పై భారత రెజ్లింగ్ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తుంది.