హైదరాబాద్: భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ బాకు, దోహాల్లో జరిగే జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రానున్న టోక్యో(2020) ఒలింపిక్స్ అర్హత టోర్నీలు అయిన ఈ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్లకు బాకు, దోహా ఆతిథ్యమివ్వబోతున్నాయి.
India vs Australia 2nd ODI Highlights: రెండో వన్డేలో భారత్ విజయం
దీప కర్మార్కర్ వెంట ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది కూడా వెళ్లనున్నారు. అయితే పురుషులకు మాత్రం ట్రయల్స్ నిర్వహించి పంపాలని జిమ్నాస్టిక్స్ సంఘాన్ని సాయ్ కోరింది. ఈ మెగా టోర్నీలకు తక్కువ వ్యవధి ఉండడంతో భారత జట్లను వెంటనే ప్రకటించాలని జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జిఎఫ్ఐ)ను సాయ్ ఆదేశించింది.
ఈ ప్రపంచకప్లు మార్చి 14-17న అజర్బైజాన్, 20-23న ఖతార్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రియాజ్ భాటి మాట్లాడుతూ "ప్రపంచకప్ టోర్నీల కోసం పెండింగ్లో ఉన్న పేర్లకు సాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒలింపిక్స్ అర్హత టోర్నీలైన ప్రపంచకప్లలో ఎలా రాణించాలన్న దానిపై జిమ్నాస్ట్లు దృష్టి పెట్టాలి" అని అన్నారు.
"ఒలింపిక్స్ అర్హత టోర్నీలు అయిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్కు జట్లను పంపించే ప్రక్రియలో ఉన్నాం. దీప కర్మాకర్తో పాటు ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది కూడా పోటీలకు వెళ్లొచ్చు. అయితే పురుషుల జట్టులో దోహా కప్ కోసం యోగేశ్వర్ సింగ్, ఆశిష్ కుమార్లను ఎంపిక చేశాం. వీళ్లిద్దరూ ఫ్లోర్, వాల్ట్ విభాగాల్లో పోటీపడతారు" అని సాయ్ వెల్లడించింది.