హైదరాబాద్: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్స్లో తెలుగు కుర్రాళ్లు పసిడి పతకాలు సాధించారు. సోదరులైన రాగాల వెంకట రాహుల్, రాగాల వరుణ్ స్వర్ణ పతకాలతో మెరిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబరిచారు.
వీరిద్దరూ సోదరులు కావడం విశేషం. అన్న రాహుల్ 85 కిలోల కేటగిరీలో సీనియర్, జూనియర్ విభాగాల్లో స్వర్ణాలు సాధిస్తే.. తమ్ముడు వరుణ్ యూత్ విభాగంలో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. మొత్తం 351 కిలోల బరువులెత్తిన రాహుల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతగా నిలిచాడు.
రాహుల్ స్నాచ్లో 156 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 195 కిలోలు ఎత్తాడు. అంతేకాకుండా పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఐదు జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన రాహుల్.. 2018లో ఇదే వేదికపై జరిగే కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు. యూత్ బాలుర 77 కిలోల విభాగంలో రాగాల వరుణ్ 269 కేజీ (స్నాచ్ 124, క్లీన్ అండ్ జెర్క్ 145) ఎత్తి బంగారు పతకం నెగ్గాడు.
మరోవైపు ఇతర విభాగాల్లో కూడా భారత వెయిట్ లిఫ్టర్లు పతకాలు సాధించారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సతీష్ కుమార్ 77 కిలోల కేటగిరీలో 320 కేజీల (స్నాచ్ 148+జెర్క్ 172) బరువుతో పసిడి నెగ్గాడు. దీంతో రాహుల్తో పాటు కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు.
అదే విధంగా ఇద్దరు జూనియర్ మహిళా వెయిట్లిఫ్టర్లు కూడా భారత్కు స్వర్ణాలు అందించారు. నికిత కాలె (యూత్ బాలికల), నిరుపమా దేవి (జూనియర్ మహిళల), జూనియర్ 77కేజీ విభాగంలో అజయ్ సింగ్ (310కేజీ) బంగారు పతకాలు సాధించారు. యూత్ బాయ్స్లో అభిషేక్ పూనియా కాంస్యం గెలిచాడు.