
హైదరాబాద్: చలిలో గజగజ వణుకుతూ పతక కాంక్షతో పోరాడిన క్రీడాకారుల పోటీలు ముగిశాయి. 17 రోజుల క్రీడా సంబరానికి తెరపడింది. దక్షిణ కొరియా వేదికగా ఈ నెల 9న ఆరంభమైన శీతాకాల ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. ఆతిథ్య దక్షిణ కొరియా నగరం ప్యాంగ్చాంగ్లో ముగింపు వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయురాలు ఇవాంకా ట్రంప్ ఈ వేడుకలకు అతిథిగా హాజరైంది. ఆరంభ వేడుకల్లో ఉమ్మడిగా మార్చ్ పాస్ట్లో పాల్గొన్న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా అథ్లెట్లు.. ముగింపు వేడుకల్లో మాత్రం వేర్వేరు జెండాలతో కవాతు చేశారు.
నార్వే 14 స్వర్ణాలు సహా 39 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీ 14 స్వర్ణాలతో పాటు 31 పతకాలతో రెండో స్థానం సాధించింది. కెనడా 11 స్వర్ణాలు సహా 29 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.
శీతాకాల ఒలింపిక్ పోటీల నుంచి రష్యా జట్టును బహిష్కరిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. తమ ఆటగాళ్లు డ్రగ్స్ ఇచ్చి అంతర్జాతీయ పోటీలకు రష్యా ప్రభుత్వమే స్వయంగా పంపుతుందని తేలిన నేపథ్యంలో ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రారంభ వేడుకలతో పాటు, ముగింపు వేడుకలకు సైతం ప్యాంగ్ చాంగ్ ఒలింపిక్స్ వెబ్సైట్ హ్యాక్కు గురి కావడంతో నిషేదిత రష్యా దేశమే చేసిందంటూ ఆరోపణలు వస్తున్నాయి.