
హైదరాబాద్: హిమ దాస్.. దేశం గర్వించేలా.. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో 400మీ. పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి దేశం గర్వించేలా తన ప్రతిభను చాటింది. కాగా, రెండు రోజులుగా ఈ అసోం అమ్మాయిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసించడానికి పోటీ పడ్డారు.
అయితే ఆమె ప్రతిభను కేవలం ప్రశంసలతోనే సరిపెట్టడమే విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు దక్కిన నజరానా, బహుమతులు కానీ ఈ గ్రామీణ క్రీడాకారిణికి దక్కకపోవడం గమనార్హం. క్రీడలకు అంతంత మాత్రానే ప్రోత్సాహకం లభించే మన దేశంలో విజయాలు సాధిస్తే మాత్రం బహుమతులు, నజరానాలతో పోటీపడటం గతంలో చాలా సందర్భాల్లో చూశాం.
అయితే హిమ విషయంలో మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆమె ఖర్చులు భరిస్తామని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పి క్రీడా మంత్రిత్వ శాఖ చేతులు దులుపుకోవడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అయితే ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారిణులకు దేశం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. ఏవేవో కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు వరదలో ముంచెత్తాయి.. ఆకాశానికి ఎత్తాయి.. కార్లు ఇచ్చాయి.. కానుకలిచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ చాలా మంది స్పాన్సర్లు, పుష్కలంగా డబ్బులున్న టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టార్లకే కాకుండా.. మట్టిలో మాణిక్యమైన హిమ దాస్ వంటి గ్రామీణ క్రీడాకారులకు కూడా సాయం అందిస్తే బాగుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.