మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రైజ్మనీపై పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుశాలె తండ్రి సురేశ్ కుశాలె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా ప్రభుత్వం ఒలింపిక్ విజేతలకు ఇచ్చిన ప్రైజ్మనీతో పోలిస్తే తన కుమారుడుకి మహారాష్ట్ర ప్రభుత్వం తక్కువ నజరానా ఇచ్చిందని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్-2024లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో షూటర్ స్వప్నిల్ కుశాలె కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
దీంతో తమ రాష్ట్రానికి చెందిన స్వప్పిల్కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు నజరానా ప్రకటించింది. అయితే స్వప్నిల్కు రూ. 5 కోట్లు ప్రైజ్మనీ ఇవ్వాలని, అంతేగాక పుణెలోని బాలేవాడిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఓ ఫ్లాట్ ఇవ్వాలని సురేశ్ కుశాలె డిమాండ్ చేశారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్ విజేతలకు రూ.5 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.

అయితే హర్యానా ప్రభుత్వం.. ఒలింపిక్స్లో స్వర్ణ విజేతకు రూ.6 కోట్లు, రజతం సాధించిన వాళ్లకు రూ. 4 కోట్లు, కంచు మోత మోగించిన ప్లేయర్లకు రూ.2.5 కోట్లు నజరానా ప్రకటించింది. ''మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ ప్రకారం ఒలింపిక్ కాంస్య పతక విజేతకు రూ.2 కోట్లు దక్కుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ప్రమాణాలు ఏర్పాటు చేస్తుంది? 72 ఏళ్లలో రాష్ట్రం నుంచి ఒలింపిక్ పతకం అందుకున్న రెండో వ్యక్తి స్వప్నిల్ (1952లో రెజ్లర్ కేడీ జాదవ్ తర్వాత)''
''ఇలాంటి పరిస్థితి ఎదురువుతుందని ముందే తెలిస్తే స్వప్నిల్ను ఇతర క్రీడలు ఆడేలా ప్రోత్సహించేవాడిని. సామన్య నేపథ్యం నుంచి స్వప్నిల్ వచ్చాడని ఇలా చేస్తున్నారా? ఓ ఎమ్మెల్యే కొడుకు లేదా మినిష్టర్ కుమారుడు పతకం సాధిస్తే ఇదే ప్రైజ్మనీ ఇచ్చేవారా? స్వప్నిల్కు రూ.5 కోట్లు రివార్డుగా ఇవ్వాలి. ప్రాక్టీస్కు అనువుగా ఉండేలా బాలేవాడి స్పోర్ట్స్ స్టేడియానికి దగ్గరలో ఓ ఫ్లాట్ ఇవ్వాలి. అలాగే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ షూటింగ్ చేసే ప్రాంతానికి స్వప్నిల్ పేరు పెట్టాలి'' అని సురేశ్ కుశాలె పేర్కొన్నారు.