బెంగళూరు: క్రికెటర్ రాబిన్ ఊతప్ప త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న బాల్య స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ను అతను పెళ్లాడబోతున్నాడు. ఈ మేరకు వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది.
తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను రాబిన్ ఊతప్ప సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశాడు. గత కొద్ది రోజులుగా రంజీ ట్రోఫీ మ్యాచులకు దూరంగా ఉండడంతో శీతల్ వద్ద పెళ్లి ప్రస్తావన తేవడానికి సమయం చిక్కినట్లు రాబిన్ ఊతప్ప తెలిపాడు.
తమ సుదీర్ఘం ప్రేమకు శీతల్ కూడా వెంటనే అంగీకారం తెలియజేయడంతో నిశ్చితార్థం కూడా వెంటనే జరిగినట్లు అతను చెప్పాడు. ఎప్పటి నుంచో ప్రేమను పెళ్లిగా మార్చుకుందామని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా, తమ పెళ్లి సంబంధించిన ప్రతిపాదన కోసం రాబిన్ నెలల తరబడిగా వేచి చూస్తున్నట్లు తనకు తెలియదని శీతల్ అన్నది.
2008లో టీమిండియా జట్టు నుంచి తప్పించినప్పటి నుంచి రాబిన్ ఊతప్ప ఆటను ఆనందించడం ఆపేశాడు. అతనికి శీతల్ నైతిక మద్దతు ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత అతను చెలరేగిపోయాడు.