
ఢిల్లీ: ప్రముఖ మహిళా రెజ్లర్లు బబితా ఫోగాట్, గీతా ఫోగాట్ కజిన్ సిస్టర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 17 సంవత్సరాలు. ఫైనల్ ఓటమిని భరించలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రసిద్ధ ఫోగాట్ కుటుంబ సభ్యురాలైన రితికా.. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మహిళలు మరియు పురుషుల కుస్తీ టోర్నమెంట్లో ఆడుతున్నారు.
రితికా ఫోగట్.. మహావీర్ ఫోగట్ అకాడమీలో గత ఐదేళ్లుగా రెజ్లింగ్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫోగాట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. తాజాగా భరత్పూర్లోని లోహ్ఘర్ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ ఉమెన్, సబ్ జూనియర్ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచిన రితికా ఫైనల్కు చేరుకున్నారు.
మార్చి 14న జరిగిన ఫైనల్ మ్యాచ్లో రితికా ఫోగట్ ఓటమిపాలయ్యారు. కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవిచూడడంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రితికా మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చి 16న రితికా అంత్యక్రియలు జరిగాయి.
రితికా ఫోగట్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ... 'ఆటలో గెలుపోటములు సహజమే. రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదు. రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. కోచ్ మహావీర్, మా తండ్రి మెన్పాల్ కూడా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో రితికాతోనే ఉన్నారు. ఓటమి తర్వాత రితికతో మాట్లాడారు. మరింత కష్టపడితే విజయాలు అవే వస్తాయని భరోసా ఇచ్చారు. అయినా రితికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్కి గురిచేసింది' అని తెలిపాడు.