రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ ముగిశాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు బ్రెజిల్లోని రియో డి జనీరోలో అత్యంత వైభవంగా సాగిన ఒలింపిక్స్ 2016 ముగింపు వేడుకలను మారకానా స్టేడియంలో బ్రెజిల్ సంస్కతి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు.
సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ వేడుకల్లో కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, కళాకారుల నృత్యాలతో స్టేడియం మారుమోగింది. ఒలింపిక్స్లో పాల్గొన్న ఆయా దేశాల జాతీయ జెండాలతో అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు.

బ్రెజిల్ సంస్కృతి, ప్రత్యేకతలను చాటుతూ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలను కూడా ఇదే స్టేడియంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ముగింపు వేడుకలు రియో డీ జనీరోలోని మరకానా స్టేడియాంలో నభూతో నభవిష్యతి అన్న చందంగా జరిగాయి.
చివరిగా విక్టరీ సెర్మనీ జరుగగా, మెన్స్ మారథాన్ లో విజయం సాధించిన ఆటగాళ్లకు పతకాలను బహూకరించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బక్ పతకాలను బహూకరించగా, స్వర్ణ పతకాన్ని కెన్యాకు చెందిన లూయిడ్ కిప్చోజీ అందుకున్నాడు.

ఈ సందర్భంగా ఒలింపిక్స్ కమిటీ ఛీప్ థామస్ బాచ్ మాట్లాడుతూ అద్భుమైన సిటీలో అద్బుతమైన ఒలింపిక్స్ అంటూ కొనియాడారు. 2020లో ఒలింపిక్స్ జరిగే జపాన్ రాజధాని టోక్యో ప్రతినిధులకు ఒలింపిక్స్ పతకాన్ని అందించడంతో రియో వేడుక లాంఛనంగా ముగిసింది.
ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా సాక్షి మాలిక్
రెజ్లింగ్లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారత పతాకధారిగా వ్యవహరించింది. జాతీయ జెండాను చేతబూని ఈ కార్యక్రమంలో పాల్గొంది. బ్యాడ్మింటన్లో రజతం సాధించిన పీవీ సింధు భారత్కు చేరుకోవడంతో భారత పతాకధారిగా సాక్షిని ఎంపిక చేశారు.
పతకాల్లో అగ్రస్థానం అమెరికాదే
రియో ఒలింపిక్స్ 2016 పతకాల్లో మరోసారి అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్లో మొత్తం 121(46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యం) పతకాలను తన ఖాతాలో వేసుకొంది. ఇక చైనా 70 (26స్వర్ణాలు, 18 రజతాలు, 26 కాంస్యాలు) పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.

64వ స్థానంలో భారత్
గ్రేట్ బ్రిటన్ 67( 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాలు) పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ రెండు పతకాలతో (రజతం-పీవీ సింధు, కాంస్యం-సాక్షి మాలిక్) 64వ స్థానంలో ఉంది. మొత్తంగా రియోలో కనీసం ఒక్క పతకమైన సాధించిన దేశాల సంఖ్య 87గా ఉంది.
ముగింపు వేడుకల్లో జపాన్ ప్రధాని షింజో అబే
2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయాన్ని రియోలోనే అభిమానులకు తేలిసేలా చేసింది జపాన్. టోక్యో మేయర్కు ఒలింపిక్స్ పతకాన్ని లాంఛనంగా అందించిన తరువాత జపాన్ వేడుకలు రియో వేదికపై ప్రారంభమయ్యాయి.
రోబోలు స్టేడియం మైదానంపై జపాన్ జెండాను పరుస్తుండగా ఈ వేడుక మొదలైంది. తమ దేశపు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూనే, అధునాతన టెక్నాలజీని తామెలా వాడుతున్నామో జపాన్ చూపింది. టోక్యోలోని స్టేడియాలతో పాటు మొత్తం నగరాన్నే మకరానా స్టేడియంలో ఆవిష్కరించింది.

'సీయూ ఇన్ టోక్యో
జపాన్ ప్రధాని షింజో అబే ఏకంగా మైదానం మధ్యలోకి వచ్చేశారు. మైదానం మధ్యలో ప్రత్యక్షమైన వేదికపైకి వచ్చిన ఆయన్ను చూసిన క్రీడాభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 'సీయూ ఇన్ టోక్యో' అంటూ జపాన్ క్రీడాకారులు ప్రదర్శించిన నృత్య విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా షింజో మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ టోక్యోకు స్వాగతం పలుకుతున్నామని వ్యాఖ్యానించారు. టోక్యోలో ఒలింపిక్స్ను మరింత సంబరంగా ఆటల పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.