రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భాగంగా జరుగుతున్న టెన్నిస్ పోటీల్లో సంచలనం నమోదైంది. పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధిస్తాడన్న అంచనాలతో బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ అనూహ్యాంగా తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు.
ఒలింపిక్స్ రెండో రోజు ఆటల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో డెల్ పాట్రో(అర్జెంటీనా)తో చేతిలో నొవాక్ జకోవిచ్ 7-6, 7-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో రెండు సెట్ లూ టై బ్రేక్కు దారి తీశాయి. చివరకు పెట్రో దాటికి జకోవిచ్ ఒలింపిక్స్ నుంచి భారంగా నిష్క్రమించాడు.

కాగా, లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించే దిశగా జరిగిన మ్యాచ్లో జోకోవిచ్ను ఓడించిన టెల్ పోట్రో, మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఈ ఓటమితో గోల్డెన్ స్లామ్ సాధించే అవకాశాన్ని జకోవిచ్ జార విడుచుకున్నాడు. ఈ ఏడాది జూన్లో జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో నాలుగు గ్రాండ్ స్లామ్లను సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
రియో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధిస్తే గోల్డెన్ స్లామ్ జకోవిచ్ సొంతం అయ్యేది. ఒలింపిక్స్ తొలి రౌండ్లోనే జకోవిచ్ వెనుదిరగడంతో ఆ అవకాశం మరో నాలుగు సంవత్సరాలు పాటు నిరీక్షించక తప్పదు. మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడుతూ ఈ ఓటమితో తాను చాలా బాధపడుతున్నానని, డెల్ పాట్రోను తక్కువగా అంచనా వేయడమే తన ఓటమికి కారణమని, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నానని పేర్కొన్నాడు.