రియో డీ జనీరో: ఆమెపై దేశం మొత్తం నమ్మకం పెట్టుకుంది. రియో ఒలింపిక్స్ లో మనదేశానికి పతకం తీసుకొస్తుందని. కానీ, ఆమె నాలుగవ స్థానంలో నిలిచి అడుగుదూరంలోనే ఆగిపోయింది. కానీ, పతకం కోసం ఆమె చేసిన విన్యాసాలు మాత్రం అందరి మనసులు గెలుచుకున్నాయి. ఆమే తొలిసారి భారత్ తరపున జిమ్నాస్టిక్స్ లో ఫైనల్ చేరిన దీపా కర్మాకర్. అందుకే, ఆమె ఏ పతకం తేలేకపోయినా ఆమే మన బంగారమంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్ నుంచి పతకం లేకుండానే నిష్క్రమించింది. కానీ తలెత్తుకుని సగర్వంగా నిలిచే ప్రదర్శన చేసిందామె. కొన్ని నెలల కిందట ఓ భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్కు అర్హత సాధించిందంటే.. ఏదో నామమాత్రంగా వెళ్లడం, రావడమే అనుకున్నారు చాలామంది! కానీ తనను తక్కువగా అంచనా వేసిన వాళ్లందరినీ విస్మయానికి గురి చేస్తూ నాలుగు రోజుల కిందట వాల్ట్ విభాగంలో ఏకంగా ఫైనల్ చేరి ఆశ్చర్యపరిచిన దీప.
తుది పోరులోనూ అంచనాల్ని మించి అద్భుత ప్రదర్శనే చేసింది. ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్లతో పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచిన దీప.. త్రుటిలో పతకం చేజార్చుకుంది. జిమ్నాస్టిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారిణి అనదగ్గ సిమోన్ బైల్స్ సహా చాలామంది సాహసించని అత్యంత ప్రమాదకర విన్యాసమైన ప్రొడునోవాను ఫైనల్లో అలవోకగా చేసిన దీప.. 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

జిమ్నాస్టిక్స్లో చైనా ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశానికి చెందిన యాన్ వాంగ్.. దీప తర్వాతి స్థానంలోనే నిలిచింది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణాలు సాధించిన ఉజ్బెకిస్థాన్ దిగ్గజ జిమ్నాస్ట్ చుసోవితినా సైతం దీప కంటే కింద ఏడో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టే మన దీప ఎంత గొప్ప ప్రదర్శన చేసిందో అంచనా వేయొచ్చు.
దిగ్గజాలున్నా దీప ప్రదర్శన అద్భుతమే
కాగా, వాల్ట్ ఫైనల్లో పోటీ పడ్డ ఎనిమిది మందిలో దీప ఆరో జిమ్నాస్ట్గా పోటీకి దిగింది. అప్పటికే పోటీ పడ్డ ఐదుగురిలో స్విట్జర్లాండ్ జిమ్నాస్ట్ స్టీన్రూబర్ 15.216 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీప చేసిన తొలి విన్యాసానికి 14.866 పాయింట్లు (డిఫికల్టీ 6+ ఎగ్జిక్యూషన్ 8.866) వచ్చాయి. అయితే తొలి ప్రయత్నంలో మామూలు విన్యాసమే చేసిన దీప.. ఆ తర్వాత ఎంతో ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసం చేసింది.
ప్రమాదకర రీతిలో సుడులు తిరుగుతూ మ్యాట్ మీదికి అద్భుతంగా ల్యాండ్ అయిన దీప విన్యాసానికి జడ్జీలు కూడా ముగ్ధులయ్యారు. 15.266 పాయింట్లిచ్చారు. దీంతో రెండు విన్యాసాల సగటు 15.066 అయింది. దీప రెండో స్థానానికి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా భారత అభిమానుల్లో పతకాశలు ఉవ్వెత్తున లేచాయి.
స్వర్ణానికి తిరుగులేని ఫేవరెట్ అయిన బైల్స్ చివర్లో రావాల్సి ఉండటంతో, ఆమె కంటే ముందు వచ్చే రష్యా జిమ్నాస్ట్ మరియా పసెక.. దీప కంటే తక్కువ పాయింట్లు సాధిస్తే చాలు.. మనమ్మాయికి కనీసం కాంస్యం ఖాయం అయిపోయేది. కానీ అద్భుత విన్యాసాలు చేసిన మరియా 15.253 పాయింట్లతో అగ్రస్థానానికి చేరిపోయింది. దీప మూడో స్థానానికి పడింది. చివర్లో బైల్స్ ఎప్పట్లాగే కళ్లు చెదిరే ప్రదర్శనతో 15.966 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లడంతో దీప నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.