ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్ ఎంపికయ్యారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా 77 ఏళ్ల రణధీర్ సింగ్ ఘనత సాధించారు. కువైట్కు చెందిన షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా స్థానంలో రణ్ధీర్ 2021 నుంచి ఓసీఏకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
నైతిక విలువల ఉల్లంఘన కింద ఈ ఏడాది మే నెలలో షేక్ అహ్మద్పై 15 ఏళ్ల నిషేధం విధించారు. కాగా, ఇకపై తాత్కాలికంగా కాకుండా పూర్తిస్థాయిలో రణ్ధీర్ అధ్యక్ష బాధ్యతలు అందుకున్నాడు. ఈ మాజీ షూటర్ అయిదు ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. భారత ఒలింపిక్ సంఘం, ఓసీఏలో వివిధ పదవులు చేపట్టారు. 2028 వరకు ఓసీఏ అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగుతారు.

2024-2028 టర్మ్ వరకు ప్రెసిడెంట్ బాధ్యతలు అందుకోవడానికి రణధీర్కు 50 శాతానికిపైగా మద్దతు అవసరం. అయితే ఆసియాలోని 45 దేశాల ప్రతినిధులు పూర్తి మద్దతు ఇచ్చారు. 44 మంది రణ్దీర్కు మద్దతివ్వగా, ఒక్కరు గైర్హాజరయ్యారు. కాగా, ఓసీఏ అధ్యక్ష పదవికి ఎన్నికవడంలో తనకి సహకరించినందరికీ రణధీర్ ధన్యవాదాలు తెలిపారు.
జనరల్ అసెంబ్లీలో ఓసీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి 'యోగాసన'కు ఆసియా క్రీడల్లో చోటు కల్పించారు. ఆసియా క్రీడల్లో యోగాసనను ప్రదర్శన ఈవెంట్గా చేర్చారు. 2026లో జపాన్లోని ఐచీ-నగోయా వేదికగా జరగనున్న ఆసియా మెగా క్రీడల్లో యోగాను ప్రదర్శించనున్నారు. దీని గురించి కొత్త అధ్యక్షలు రణ్ధీర్ మాట్లాడుతూ.. అన్ని సభ్య దేశాలను ఒప్పించడానికి పది రోజులు పట్టిందని అన్నారు. 2030 ఆసియా క్రీడల వరకు యోగాను పతక క్రీడల్లో భాగం చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.