
హైదరాబాద్: కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మరోసారి క్రీడాస్ఫూర్తి చాటారు. ఇండోనేషియా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్లో దురదృష్టం వెంటాడి కాంస్యం కోల్పోయిన భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్కు రూ.10 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఆసియా గేమ్స్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో లక్ష్మణన్ మూడో స్థానంలో నిలిచాడు.
నిర్వాహకులు సైతం అతడికి కాంస్య పతకం ప్రకటించారు. అయితే పరుగులో పొరపాటున అతడి కాలు ట్రాక్ లైన్ను దాటి బయటపడింది. దీంతో అనర్హతకు గురై పతకాన్ని కోల్పోయాడు. దీంతో ఆసియా క్రీడల్లో 20 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో తొలిసారి పతకం లభించిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
నాలుగో స్థానంలో నిలిచిన వ్యక్తికి కాంస్యం అందజేశారు. మరో అథ్లెట్ తగలడం వల్లే అతను లైన్ దాటాడని భారత్ చేసిన అప్పీల్ను నిర్వాహకులు తోసిపుచ్చారు. పరుగును పూర్తిచేసిన లక్ష్మణన్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అతడికి రూ.10 లక్షల బహుమతిని అందించినట్లు మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు.
ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఇంకా కష్టపడి పతకం కోసం శ్రమించేలా ఆ క్రీడాకారుడిని ప్రోత్సహించాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ రూ.10 లక్షలు బహుమతి ప్రకటించారు" అని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్లో పేర్కొంది.
అసలేం జరిగింది?
10వేల మీటర్ల పరుగులో భారత స్ప్రింటర్ గోవిందన్ లక్ష్మణన్ ఫైనల్ రేసులో పాల్గొన్నాడు. ఫైనల్ పోరులో 29 నిమిషాల 44:91 సెకన్లలో పరుగు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిన గోవింద్ కాంస్య పతకం సాధించినట్లు తొలుత ప్రకటించారు.
ఇక్కడ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ సాధించిన బెహ్రయిన్ స్ప్రింటర్ చాని హసన్తో రేసును పూర్తి చేసే సమయంతో పోల్చితే గోవిందన్ దాదాపు నిమిషం వెనుకబడ్డాడు. దాంతో స్వర్ణం పతకం సాధించే అవకాశాన్ని స్వల్ప తేడాలో కోల్పోయాడని భారత అభిమానులు భావించారు.
కనీసం కాంస్య పతకం సాధించాడు కదా అని అనుకున్నారు. కానీ, చిన్నపాటి తప్పిదం కారణంగా ఆ పతకం కూడా చేజారింది. రేసు పూర్తి చేసే క్రమంలో ఓ చోట అతడి కాలు తెలుపు రంగు లైన్కు బయటవైపు పడినట్లు తేలింది. దీంతో డిస్క్వాలిఫై చేశారు.
దీంతో నాలుగో స్థానంలో నిలిచిన చైనా ఆటగాడు చాంగ్హాంగ్కు కాంస్య పతకం అందుకున్నాడు. దీంతో ఆసియా గేమ్స్లో 20 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో తొలిసారి పతకం లభించిందన్న ఆనందం ఎంతోసేపు అభిమానులకు నిలవలేదు.