చండీఘడ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఛీఫ్ సెలెక్టర్ వెంగ్ సర్కార్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. సిరీస్ మధ్యలో అలాంటి ప్రకటనలు చేయడం సరి కాదని భారత క్రికెట్ జట్టు మేనేజర్ లాల్ చంద్ రాజ్ పూత్ అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు క్రీడాకారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆటగాళ్లు అవేవీ పట్టించుకోవద్దని ఆయన సూచించారు. రేపటి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత జట్లు గెలుస్తుందని ఆయన అన్నారు. ఆడలేకపోతే తప్పుకోవాలని వెంగ్ సర్కార్ సీనియర్ ఆటగాళ్లను హెచ్చరించారు. ఎంతో మంది జట్టులో స్థానం కోసం నిరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ లను ఉద్దేశించి ఆయన ఆ ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాపై గత రెండు వన్డేల్లోనూ భారత్ ఓడిపోవడంతో వెంగ్ సర్కార్ ఆ ప్రకటన చేశారు. ఆ ముగ్గురు కూడా బ్యాటింగులో చూపిన ప్రతిభ నామమాత్రమేనని చెప్పవచ్చు.