
ముంబై: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరపై ప్రశంసలతో పాటు నజరానాల వర్షం కూడా కురుస్తోంది. అవనికి రాజస్థాన్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మహిళల ఆర్-2 పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన అవనికి రూ.3 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. జావెలిన్ త్రో ఎఫ్-46 విభాగంలో రజతం, కాంస్యం సాధించిన దేవేంద్ర జజారియా, సుందర్ సింగ్ గుర్జార్లకు రూ.2 కోట్లు, రూ.1కోటి చొప్పున అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
టోక్యో పారాలింపిక్స్ 2020లో సోమవారం రాజస్థాన్ అథ్లెట్లు అవని లేఖర, దేవేంద్ర జజారియా, సుందర్ సింగ్ పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు పారాలింపిక్స్లో పతకాలు సాధించి దేశం, రాష్ట్రం గర్వపడేలా చేశారని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ముగ్గురికి అటవీ శాఖలో కీలక ఉద్యోగాలు కూడా ప్రకటించారు. ఇక పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56 ఈవెంట్లో రజతం సాధించిన ఇంకో అథ్లెట్ యోగేశ్ కతునియాను కూడా సీఎం అశోక్ గహ్లోత్ అభినందించారు. దేశం గర్వపడేలా ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నారు.
స్వర్ణం సాధించిన అవని లేఖరకు పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్యూవీని అవనికే ఇస్తానని ప్రకటించారు. సహోద్యోగి వేలు దగ్గరుండి మరి ఈ వ్యవహారాలు చూసుకొనున్నట్లు చెప్పారు. షూటింగ్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్యూవీ నడపడం అంటే చాలా ఇష్టమని.. ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్లతో కూడిన ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువస్తే.. తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. దీపా మాలిక్ ట్వీట్పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరారు.
మరోవైపు దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖర, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ అవనితో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ప్రశంసించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయం మనందరిది అని పేర్కొంది.