అహ్మదాబాద్: వర్షం కారణంగా దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం సాయంత్రం ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయిన సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో ఏడు వికెట్లు కోల్పోయి 494 పరుగులు చేసింది. డీ విలియర్స్ డబుల్ సెంటరీ చేసి అజేయంగా నిలిచాడు. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి అతను 217 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. హరీస్ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. కలీస్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లకు మధ్యాహ్నం వరకు శ్రమించినా ఆల్రౌండర్ కలీస్ రూపంలో ఒకే వికెట్ దక్కింది. ఓవర్నైట్ స్కోరు 223/4తో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ను కొనసాగించింది. డివిలియర్స్, కలీస్ భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. కలీస్ సెంచరీ అనంతరం శ్రీశాంత్ బౌలింగ్లో బౌల్డయి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. బౌచర్ 21 పరుగులకు, మోర్కెల్ 1 పరుగుకు అవుటయ్యారు. హర్భజన్ కు నాలుగు వికెట్లు దక్కగా శ్రీశాంత్ కు రెండు వికెట్లు, కుంబ్లేకు ఒక వికెట్ దక్కాయి.
అంతకుముందు రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు దక్షిణాఫ్రికా బౌలర్లు షాకిచ్చారు. భారత బ్యాట్స్మెన్ ట్వంటీ- 20 మ్యాచ్ను తలపించే విధంగా తొలి ఇన్నింగ్స్ ఆడారు. మన బ్యాట్స్మెన్ ముచ్చటగా 20 ఓవర్లలో 76 పరుగులు చేసి ఆలౌటయ్యారు. ధోనీ (14), పఠాన్ (21) ఇద్దరే రెండంకెల స్కోరు దాటారు. మిగిలిన వారందరు ఒక అంకెకు, అందులో ముగ్గురు డకౌట్లు అయి వెనుదిరిగారు. భారత బ్యాట్స్మెన్ అందరూ ఇలావచ్చి అలా వెళ్లారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, ఎన్తినీ మూడు కీలక వికెట్లు, మొర్కెల్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. టెస్ట్ మ్యాచ్ల్లో టీం ఇండియాకు స్వదేశంలో ఇది రెండో అత్యల్ప స్కోరు.