ఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుపై ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కురుస్తున్నాయి. ఒలింపిక్స్లో భారత్కు తొలి మెడల్ అందించిన మీరాకు 'సూపర్ వుమెన్' అనే బిరుదు ఇచ్చేశారు అభిమానులు. జీవితకాలం ఉచితంగా పిజ్జాని ఇస్తామని డొమినోస్ ఇండియా ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నజరానా ప్రకటించాయి. తాజాగా మీరాబాయి చానుకు రైల్వే శాఖ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2 కోట్ల నగదుతో పాటు ప్రమోషన్ ఇస్తున్నట్లు పేర్కొంది.
Tokyo Olympics 2021: లోకల్ ప్లేయర్ ఔట్.. జపాన్ గోల్డ్ ఆశలు గల్లంతు!!
సోమవారం భారత్కు తిరిగి వచ్చిన మీరాబాయి చాను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసింది. ఈ సందర్భంగా మీరాబాయిని ఆయన సన్మానించారు. అంతేకాదు రూ.2 కోట్ల నగదు, ఈశాన్య రైల్వేలో ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరా తన నైపుణ్యం, కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో కోట్లాది మంది భారతీయులలో స్ఫూర్తి నింపిందని అశ్విని వైష్ణవ్ కొనియాడారు. మీరాను కలవడం, సన్మానించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న మీరాను ఇప్పుడు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేశారు.
It was great to meet and congratulate the pride of India and honour of Indian Rly, @mirabai_chanu. Also felicitated her & announced Rs. 2 Cr , a promotion and more. She has inspired billions around the world with her talent, handwork and grit.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 26, 2021
Keep winning for India! pic.twitter.com/gYRftarOrr
మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల పోటీల్లో మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి ఆమె పతకం అందించింది. 49 కిలోల పోటీల్లో చైనా అథ్లెట్ హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. స్నాచ్లో 94 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాదిందింది. మరోవైపు మీరాబాయి స్నాచ్లో 87కి, క్లీన్ అండ్ జెర్క్లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం కైవసం చేసుకుంది.
అయితే కొన్ని కారణాల వల్ల హు జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఆమెపై డోపింగ్ ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి డోప్ పరీక్షలు చేయనున్నారని తెలిసింది. ఒకవేళ జిహూయి డోపింగ్ పరీక్షల్లో విఫలమైతే.. మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి ఉన్నతీకరిస్తారు.