చెస్ అంటే గతంలో అయినా, వర్తమానంలో అయినా మనందరికీ ఠక్కున గుర్తు వచ్చేది ఒక్కరి పేరే. ఆయనే విశ్వనాథన్ ఆనంద్. చెస్లో గ్రాండ్ మాస్టర్ హొదాను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి గొప్ప ఘనతను సాధించిన తొలి భారతీయుడుగా ఆయన రికార్డులకెక్కాడు. ప్రపంచ ఛాంపియన్గా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. విశ్వనాథన్ ఆనంద్ ఏకంగా అయిదు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు.
అయితే అలాంటి చెస్ దిగ్గజాన్ని భారత్ యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అధిగమించాడు. ఫిడే ర్యాంకింగ్స్లో విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత టాప్ ర్యాంకర్గా నిలిచాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో చైనాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి ఈ ఘనత సాధించాడు.

ఈ విజయంతో ప్రజ్ఞానంద ఫిడే పాయింట్లను మెరుగుపర్చుకున్నాడు. 2748.3 పాయింట్లతో 11వ ర్యాంక్కు చేరుకున్నాడు. మరోవైపు దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో ఉన్నాడు. అలాగే ప్రజ్ఞానంద మరో ఘనత అందుకున్నాడు. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ను ఓడించిన రెండో ఇండియన్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు విశ్వనాథన్ ఆనంద్ పేరిట మాత్రమే ఉండేది.
కాగా, గతేడాది జరిగిన చెస్ ప్రపంచకప్లో ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. దిగ్గజ ఆటగాడు కార్ల్సన్కు గట్టి పోటీనిచ్చి టైటిల్ను తృటిలో కోల్పోయాడు. తొలిరౌండ్ తొలిగేమ్లో ప్రజ్ఞానందపై విజయం సాధించి, రెండో గేమ్ను డ్రాగా ముగించి కార్ల్సన్ ఛాంపియన్గా నిలిచాడు. అయితే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అంతేగాక, ప్రపంచకప్లో ఫైనల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.