హైదరాబాద్: క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యుల టాస్క్ఫోర్స్ కమిటీలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్కు చోటు దక్కింది. తదుపరి మూడు ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువ పతకాలు సాధించడానికి అవసరమైన కార్యచరణ రూపొందించడానికి కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
2020, 2024, 2028 ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం అవసరమైన ప్రణాళిక తయారు చేసేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాట్లు చేయనున్నట్లు రియో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020, 2024, 2028 ఒలింపిక్స్కు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించగల క్రీడాకారులను గుర్తిస్తారు.

ఈ కమిటీలో గోపీచంద్తో పాటు టైమ్స్ గ్రూప్ ఆన్లైన్ చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా, స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ చైర్మన్ ఓం పాఠక్, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సీఈఓ వీరేన్ రస్కీనా, హాకీ కోచ్ బల్దేవ్ సింగ్, ప్రొఫెసర్ జీఎల్ ఖన్నా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత డీజీ సందీప్ ప్రధాన్లు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని క్రీడా మంత్రి విజయ్ గోయల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాలుగు నెలలు లేదా పని ఎప్పుడు పూర్తయితే అప్పుడు టాస్క్ఫోర్స్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది' అని విజయ్ గోయల్ చెప్పాడు. వచ్చే ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు ప్రభావవంతంగా పాల్గొనేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం ఈ టాస్క్ఫోర్స్ బాధ్యత అని ఆయన తెలిపాడు.