భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ ఉష ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్(67) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన ఈ రోజు ఉదయం తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు.
మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాసన్, పీటీ ఉష క్రీడా జీవితంలోనే కాకుండా ఆమె రాజకీయ ప్రస్థానంలోనూ వెన్నంటి నిలిచారు.ఆమె సాధించిన ప్రతి పతకం, ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ ఆయన ముఖ్య భూమిక పోషించారు.క్రీడాకారిణిగా ఆమె శిఖరాగ్రాన ఉన్నప్పుడు, పదవీ విరమణ తర్వాత అథ్లెటిక్స్ అకాడమీ నిర్వహణలోనూ ఆయన ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఈ దంపతులకు ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నాడు.

ప్రధాని మోదీ సంతాపం.. ఫోన్ చేసి పరామర్శ
పీటీ ఉష భర్త శ్రీనివాసన్ మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫోన్ కాల్లో ఉషను ఓదార్చిన ప్రధాని.. శ్రీనివాసన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశవ్యాప్తంగా పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉష కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.