న్యూఢిల్లీ : ఇండియాలో చదవులకు ఇచ్చినంత ప్రాధాన్యం..క్రీడలకు ఇవ్వరు. అందుకే దశాబ్దాలుగా ఒలింపిక్స్ లో ఇండియా స్థానం ఎప్పుడూ నేల చూపులు చూస్తూనే ఉంది. పొరుగు దేశాలు కుప్పలు తెప్పలుగా పతకాలను అందిపుచ్చుకుంటుంటే..! ఒక్కటంటే ఒక్క పతకం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే పరిస్థితి ఇండియాది.
అసలు ఒక్క పతకమైనా దక్కుతుందా..? లేదా..? అన్న అనుమానాల మధ్య మొత్తానికి సాక్షి మాలిక్ ఆ ఫీట్ ను సాధించి ఇండియా పరువును నిలబెట్టింది. అందుకే ఇప్పుడు సాక్షి విజయాన్ని కేవలం ఆమె తల్లిదండ్రులు మాత్రమే కాదు.. యావత్తు భారతావని హర్షిస్తోంది. ఇండియాస్ గ్రేట్ డాటర్ అని కీర్తిస్తోంది.
అయితే ముందే చెప్పుకున్నట్లు.. ఆటలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని దేశంలో ఓ ఆడపిల్లను రెజ్లింగ్ లాంటి క్రీడల పట్ల ప్రోత్సహించడమంటే మామూలు విషయం కాదు. ఇరుగు పొరుగు చెప్పిన అభ్యంతరాలను గనుక పరిగణలోకి తీసుకుని ఉంటే ఇండియాకు ఈరోజు ఒక్క పతకం కూడా దక్కి ఉండేది కాదేమో. సాక్షి మాలిక్ విజయంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన ఆమె తల్లిదండ్రులు ఇప్పుడిదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా సాక్షి తండ్రి సుబీర్ చెప్పిన మాటేంటంటే.. ఆటల పట్ల ఆసక్తి చూపించే ప్రతీ కూతురిని దేశంలోని ప్రతీ తండ్రి ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. 'తల్లిదండ్రుల సహకారం లేకుండా ఇలాంటి ఫీట్స్ ను సాధించడం కష్ట సాధ్యం. అందుకే తల్లిదండ్రులుగా సాధ్యమైనంత మేర మేము సాక్షికి ప్రోత్సాహాన్ని అందజేశాం. మొదట్లో ఆడపిల్ల రెజ్లింగ్ చేయడమేంటని విమర్శించిన వాళ్లే.. ఆ తర్వాత కామన్ వెల్త్, ఆసియన్ ఛాంపియన్ లో సాక్షి పతకాలు సాధించిన తర్వాత మెచ్చుకోవడం మొదలుపెట్టారు' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు సాక్షి తండ్రి.
క్రీడారంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న ప్రతీ ఆడపిల్లకు సాక్షి ఈరోజు ఆదర్శంగా నిలిచిందని, ప్రతీ ఒక్కరు ఆమె నుంచి స్ఫూర్తి పొందే ప్రయత్నం చేయాలని అన్నారు సుబీర్. హర్యానా ప్రభుత్వం కూడా ఆడపిల్లలను క్రీడారంగం పట్ల ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారాయన.
చిన్నప్పటి నుంచే సాక్షికి రెజ్లింగ్ పట్ల మక్కువ పెరిగిందని చెప్పుకొచ్చిన సుబీర్.. రెజ్లర్ అయిన తన తాత నుంచి సాక్షి స్పూర్తి పొందినట్లుగా చెప్పారు. ఇండియా తరుపున పతకం గెలిచాక.. మీ ఆశయాన్ని నెరవేర్చానని సాక్షితో తమతో తన ఆనందాన్ని పంచుకున్నప్పుడు తాను కంటతడి పెట్టుకున్నానని, టోక్యో ఒలింపిక్స్ లోను మెడల్ సాధించాలని కూతురిని కోరినట్లుగా తెలిపారు.

సాక్షి తల్లి సుదేశ్ మాలిక్ కూడా ఇదే అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఎవరైతే సాక్షి రెజ్లింగ్ ను విమర్శించారో.. ఆమె పతకాలు సాధించడం మొదలుపెట్టాక వారంతా సైలెంట్ అయిపోయారన్నారు. రెజ్లింగ్ చాలా శ్రమతో కూడుకున్నదయినా సరే సాక్షిని ప్రోత్సహించడానికి తాము వెనుకాడలేదని వివరించారు సుదేశ్ మాలిక్.
సాక్షి గెలుపుకు మరో సందేశాన్ని కూడా జోడించిన ఆమె తల్లి సుదేశ్ మాలిక్.. "నరేంద్ర 'మోడీ భేటీ బచావో భేటీ పడావో' పథకం తరహాలో భేటీ ఖేలో నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. సాక్షికి తమ ప్రోత్సహాం ఎప్పటికీ ఉంటుందని 2020 టోక్యో ఒలింపిక్స్ లోను సాక్షి పతకం సాధించాలని తాము ఆశిస్తున్నామని" సుదేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీని కలవడానికి వెళ్లినప్పుడు కూడా.. ఇండియా తరుపున సాక్షి తప్పకుండా పతకం సాధిస్తుందన్న నమ్మకాన్ని మోడీ సాక్షితో వ్యక్తం చేసినట్లుగా చెప్పుకొచ్చారు సాక్షి తల్లి సుదేశ్. ప్రస్తుతం తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నామని.. ఆమె రోహ్ టక్ లో అడుగుపెట్టగానే పట్టణమంతా పోస్టర్లతో ప్రచారం నిర్వహించి సాక్షికి గ్రాండ్ వెల్ కమ్ చెబుతామని చెప్పుకొచ్చారు.
ఇకపోతే 23 ఏళ్ల సాక్షి 58 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 8-5తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు ద్వారా భారత క్రీడా చరిత్రలో రెజ్లింగ్ విభాగంలో పతకం సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర స్రుష్టించింది సాక్షి. సాక్షి సాధించిన పతకంతో మొత్తంగా ఇప్పటిదాకా ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది.