టోక్యో: ఒలింపిక్స్ 2021 ఓపెనింగ్ సెర్మనీకి సమయం దగ్గరపడింది. విశ్వ క్రీడల సెర్మనీకి మరికొద్ది గంటలే ఉన్న సమయంలోనూ అక్కడి మెట్రోపాలిటన్ గవర్నమెంట్ బిల్డింగ్ దగ్గర నిరసనకారులు ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. 'ఒలింపిక్స్ను రద్దు చేయాల్సిందే' అని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. సెర్మనీ ప్రారంభమైన తర్వాత కూడా స్టేడియానికి సాధ్యమైనంత దగ్గరగా తమ నిరసనలను కొనసాగిస్తామని ఇప్పటికే వారు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ఒలింపిక్ టార్చ్ మెట్రోపాలిటన్ భవనం దగ్గరికి వచ్చిన సమయంలో నిరసనకారులు అక్కడే ఉన్నారు.
'ఈరోజు ఓపెనింగ్ సెర్మనీ జరగబోతోంది. కానీ మేము గేమ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒలింపిక్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన. ఒలింపిక్ టార్చ్ ఇక్కడికి వస్తున్న సమయంలో నిరసన తెలుపుతున్నాం' అని ఓ ఆందోళనకారుడు పేర్కొన్నాడు. ఒలింపిక్ స్టేడియం దగ్గర కూడా తాము నిరసన తెలుపుతామని మరొకరు స్పష్టం చేశారు. నిజానికి కరోనా నేపథ్యంలో గేమ్స్ను రద్దు చేయాలంటూ జపాన్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గేమ్స్ను రద్దు చేయాలని సగానికి పైగా జపాన్ వాసులు కోరుకుంటున్నారు అని ఓ సర్వే తెలిపింది.
Tokyo Olympics: అంచనాలను మించి ఖర్చు.. జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?!!
కరోనా దెబ్బకు ఒక ఏడాది వాయిదా పడ్డా, మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు, ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్లోకి అడుగుపెట్టారు. 200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది మెగా క్రీడల కోసం సిద్ధమయ్యారు. ఇక వచ్చే రెండు వారాలు వందల కోట్ల మంది అభిమానులకు పండగే. క్షణ క్షణం ఉత్కంఠకు గురవుతూ.. భావోద్వేగాల్లో మునిగి తేలనున్నారు.