భారత యువ రెజ్లర్ ప్రియా మాలిక్ అదరగొట్టింది. జోర్డాన్ వేదికగా జరిగిన జూనియర్ రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో మొదటి స్థానం సాధించి, స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం నాడు మహిళల 74 కేజీల ఫైనల్స్ జరిగాయి. ఈ పోటీల్లో జర్మనీకి చెందిన లారా సెవ్లీని ప్రియా మాలిక్ చిత్తు చేసింది.
ఈ మ్యాచ్లో ప్రియ ఏకంగా 5-0 తేడాతో విజయం సాధించింది. ప్రియా అద్భుతంగా పోరాడటంతో లారా కనీసం ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. ఈ విజయంతో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన రెండో భారత రెజ్లర్గా ప్రియా మాలిక్ రికార్డు సృష్టించింది. గతేడాది అంతిమ్ సంఘాల్ ఈ పోటీలో పసిడి నెగ్గిన సంగతి తెలిసిందే.

ఇదే పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అంతిమ్ పంఘాల్తోపాటు సవిత, అంతిమ్ కుందూ కూడా అద్భుతంగా రాణించారు. ఈ ముగ్గురూ కూడా తమ తమ విభాగాల్లో ఫైనల్కు దూసుకెళ్లారు. 53 కిలోల విభాగంలో పోటీ పడుతున్న అంతిమ్.. సెమీ ఫైనల్లో పోలినా లుకినాను 12-0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఆమె ఫైనల్లో అడుగు పెట్టింది. ఫైనల్లో గెలిస్తే అంతిమ్ ఈ టోర్నీలో తన టైటిల్ నిలబెట్టుకుంటుంది.
కాగా, ఆసియా క్రీడలకు వెటరన్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ తదితరులకు కనీసం ట్రయల్స్ లేకుండా ఎంపిక చేయడంపై ఇటీవలే అంతిమ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వినేశ్ ఇటీవలి కాలంలో ఏమాత్రం ప్రాక్టీస్ చేయలేదని, ఆమెను తనతోపాటు చాలా మంది సులభంగా ఓడించగలమని అంతిమ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలోనే కోర్టులో కేసు కూడా వేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 62 కిలోల విభాగం సెమీస్లో ఐరిస్ మతిల్డే (ఫ్రాన్స్)పై బైఫాల్ విధానంలో నెగ్గిన సవిత కూడా ఫైనల్ చేరింది. అలాగే 65 కిలోల కేటగిరీలో అంతిమ్ కుండు 9-5తో ఎకతరీనా కోష్కినాపై గెలిచింది. అదే సమయంలో 72 కిలోల విభాగంలో హర్షిత 1-2 తేడతో టర్కీ ప్లేయర్ బుకారెస్ సెర్ట్ చేతిలో ఓడి కాంస్యం కోసం తలపడేందుకు రెడీ అయింది.