
హైదరాబాద్: దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న ఆటగాళ్లను గుర్తించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఖేలో ఇండియా యాప్ను లాంఛ్ చేశారు. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో భాగంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఖేలో ఇండియా యాప్ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.
యువతకు క్రీడల ఆవశ్యకత, ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రానున్న రోజుల్లో భారత్ క్రీడల్లో మరింతగా అభివృద్ధి చెందడానికి.. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ యాప్ దోహదపడనుంది. ఈ యాప్లో 3 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
18 రకాల క్రీడలకు సంబంధించి నియమ నిబంధనలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రీడలపట్ల ఆసక్తి ఉన్న వ్యక్తుల డేటా సేకరణ, వివిధ క్రీడల కోసం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, ప్లేయర్లకు ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించడం లాంటివి అందుబాటులో ఉంచారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్కక్రమంలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.