ముంబై: మాజీ ప్రియుడు, ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా పైన బాలీవుడ్ నటి ప్రీతిజింతా స్టేట్మెంట్ తీసుకునేందుకు ముంబై పోలీసులు వాంఖేడే స్టేడియంను వేదికగా చేసుకోవాలనుకుంటుండగా.. ప్రీతి మాత్రం బాంద్రాలోని తన నివాసంలోనే ఇవ్వాలని అనుకుంటున్నారని సమాచారం.
నెస్ వాడియా తనను వేధించినట్లు ప్రీతిజింతా కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఘటన జరిగిందని ప్రీతిజింతా చెబుతున్న ప్రదేశంలోనే ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వాంఖేడేలోనే ఆమె స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారట.

మరోవైపు ప్రీతిజింతా స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అనంతరం నెస్ వాడియా స్టేట్మెంట్ను కూడా విచారణ అధికారులు తీసుకోనున్నారు.
మాజీ ప్రియుడు నెస్ వాడియాపై నటి ప్రీతిజింతా కొద్ది రోజుల క్రితం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలువురు సాక్ష్యులను విచారించారు. అనంతరం ప్రీతి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. తన స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రీతి ఆదివారం అమెరికా నుండి ముంబైకి వచ్చారు.
తదుపరి విచారణ కోసం ప్రీతి స్టేట్మెంట్ అవసరమని విచారణ అధికారులు చెబుతున్నారు. వాంఖేడే స్టేడియంలో స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్న విచారణ అధికారులు.. స్టేడియంలో స్టేట్మెంట్ తీసుకొని ఆరోజు కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు.