ముంబయి: ప్రచారం కోసమే ముంబయి మోడల్ పూనమ్ పాండే, భారత్ గెలిస్తే తాను బహిరంగంగా బట్టలిప్పేస్తానని చెప్పారంట. అయితే ప్రచారం కోసమే అన్న మాటలను ఆమె ససేమీరా అంటోంది. తాను టాప్ మోడల్ నని అలాంటి తనకు ప్రచారం కోసం అర్రులు చాచాల్సిన అవసరం ఏముందని పూనమ్ పాండే చెబుతోందంట. ఏదైతేనేం యువత మాత్రం కప్పుతో పాటు పూనమ్ కోసమూ వేచి చూశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె మాటల్లోనే ప్రచార వ్యూహం బయటపడుతోందని పలువురు అంటున్నారు.భారత్ - పాకిస్తాన్ సెమీ ఫైనల్ మ్యాచ్ కు ముందు పాక్ పై భారత్ గెలిస్తే స్టేడియంలో బట్టలు విప్పేసి తిరుగుతానని ప్రకటించింది అంతకు ముందు రోజు. అంతేకాదు ఆటగాళ్లు కోరుకుంటే డ్రెస్సింగ్ రూంలో నగ్నంగా కనిపించడానికి సిద్ధమని ప్రకటించింది. అయితే పాక్ పై భారత్ గెలిచిన తర్వాత మాత్రం మాట మార్చి తాను పాక్ పై గెలిచినప్పుడు విప్పుతానని చెప్పలేదని, కప్పు గెలిస్తేనే విప్పుతానని చెప్పానని చెప్పింది. అయితే ఫైనల్ లో శ్రీలంకపై భారత్ గెలుస్తుందని అందరూ భావించినట్లుగా పూనమ్ కూడా భావించిందో ఏమో వెంటనే ప్లేటు మార్చింది. తాను బట్టలు విప్పడానికి సిద్ధమే అని అయితే తనకు బిసిసిఐ అనుమతి ఇవ్వాలని మెలిక పెట్టింది.ఎలాగూ బిసిసిఐ అనుమతి ఇవ్వదని, ఆమె నగ్నంగా కనిపించడాన్ని అందరూ ఖండిస్తారు, దానికి ఎవరూ ఒప్పుకోరని తెలిసీ కేవలం ప్రచారం కోసమే ఆమె దుస్తులు విప్పేస్తాననే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె ప్రచారం కోసం బట్టలు విప్పేస్తానని చెప్పినప్పటికీ ఆమెపై వివాదం మాత్రం అల్లుకుంది. భోపాల్ లో ఓ న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. అంతేకాదు పెటా వంటి జంతు సంరక్షణ సంస్థలకే తప్ప ఇలాంటి వాటికి నగ్నంగా కనిపించడం సమర్థనీయం కాదని పలు సంఘాలు హెచ్చరించాయి. భారతీయ జనతా పార్టీ, శివసేన వంటి పార్టీ పూనమ్ పాండే బట్టలు విప్పెస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు కూడా.