Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో పతకం పడింది. పురుషుల జావెలిన్ త్రో కేటగిరీలో రజతాన్న్ని ముద్దాడింది. ఈ విభాగంలో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. వెండి పతకాన్ని అందుకున్నాడు. ఇందులో బంగారు పతకం అనుకున్నప్పటికీ- అది సాధ్యపడలేదు.
గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్లో పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీం చరిత్ర సృష్టించాడు. ఏకంగా 90 మీటర్లకు పైగా బల్లేన్ని సంధించాడు. నదీం సంధించిన ఈటె 92.97 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. ఒలింపిక్స్లో అతనికి ఇదే తొలి బంగారు పతకం. జావెలిన్ త్రోలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ కూడా.

ఈ కేటగిరీలో నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం పాటు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్ 88.54 మీటర్ల దూరం ఈటెను సంధించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా రెండు పతకాలను సాధించిన తొలి భారత అథ్లెట్గా చరిత్రకెక్కాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్ అందుకున్న విషయం తెలిసిందే.
క్వాలిఫికేషన్ రౌండ్లో ఈటెను అందరి కన్నా ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్ అంచనాలు పెంచాడు నీరజ్ చోప్రా. ఫైనల్లో తడబడ్డాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. అదే అతనికి రజత పతకాన్ని ఖాయం చేసింది. ఆ తరువాతి నాలుగు ప్రయత్నాల్లో ఆ స్థాయిలో బల్లేన్ని విసరలేకపోయాడు.
అదే సమయంలో అర్షద్ నదీమ్ చెలరేగాడు. 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ను అందుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్స్లో 89 మీటర్లు కూడా విసరని నదీమ్.. ఫైనల్లో మాత్రం కమ్ బ్యాక్ అయ్యాడు. రెండు సార్లు ఈటెను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరగలిగాడు.
రజత పతకాన్ని అందుకున్న నీరజ్ చోప్రాకు ఫోన్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో మాట్లాడారు. శుభాకాంక్షలు తెలియజేశారు. అర్ధరాత్రి దాటిన ఒంటిగంటకు కూడా యావత్ దేశం నిద్రపోలేదని, హాకీ మ్యాచ్ను చూడ్డానికి ప్రతి ఒక్క భారతీయుడూ ఎదురు చూశారని పేర్కొన్నారు.
ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా మళ్లీ మళ్లీ తన ప్రతిభను చాటుకుంటున్నాడని మోదీ ప్రశంసించారు. మరో ఒలింపిక్స్ విజయం సాధించడం, పతకంతో దేశానికి పునరాగమనం చేయబోతోండటం పట్ల దేశ ప్రజలందరూ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోన్నారని పేర్కొన్నారు. రజతం సాధించినందుకు నీరజ్ చోప్రాను అభినందిస్తున్నానని అన్నారు.