చెస్ ఒలింపియాడ్లో పసిడి సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం భారత క్రీడారంగంలో సరికొత్త అధ్యాయమని కితాబిచ్చారు. అంతేగాక ఈ గెలుపు తరతరాలకు చెస్ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత్ రెండు స్వర్ణాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2014, 2022లో పురుషుల జట్లు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన. కాగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భారత చెస్ ప్లేయర్లను అభినందించారు. రెండు స్వర్ణాలు సాధించిన చాంపియన్లను చూసి గర్విస్తున్నామని అన్నారు.

అద్భుత తెలివి తేటలు, కఠోర శ్రమ, అంకితభావంతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. భారత మహిళల జట్టును రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ దేశ కుమార్తెలు ఏమి సాధింగలరో మీరు నిరూపించారని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన చివరి రౌండ్ భారత పురుషుల జట్టు స్లోవేనియాను 3.5-0.5తో ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. అయితే శనివారం పదో రౌండ్ ముగిసేసరికే పురుషుల జట్టుకు పసిడి ఖాయమైంది. స్లొవేనియాతో చివరి రౌండ్ను డ్రా చేసినా బంగారు పతకం వచ్చేది. కానీ భారత్ విజయఢంకా మోగించింది.అమెరికా రజతం, ఉజ్బెకిస్థాన్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాయి.
మరోవైపు భారత మహిళల జట్టు గొప్పగా సత్తాచాటింది. పసిడి దక్కాలంటే తప్పక విజయం సాధించాల్సిన పోరులో అజర్బైజాన్పై 3.5-0.5తో గెలిచింది. గోవార్పై దివ్య 39 ఎత్తుల్లోనే గెలిచింది. ఉల్వియాతో గేమ్ను వైశాలి డ్రా చేసుకుంది. మమ్మాద్జాదాపై 51 ఎత్తుల్లో హారిక నెగ్గింది. చివరిగా ఖానిమ్ను 53 ఎత్తుల్లో వంతిక ఓడించింది. కజకిస్థాన్ (18) రజతం, అమెరికా (17) కాంస్య పతకం అందుకున్నాయి. ఆఖరి రౌండ్లో పరస్పరం తలపడిన కజకిస్థాన్-అమెరికా డ్రా చేసుకోవడంతో భారత్ (19) మహిళలకు స్వర్ణం దక్కింది.