పారిస్ వేదికగా జరగుతున్న పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో శనివారం మరో రెండు పతకాలు చేరాయి. జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు. మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కంచు మోత మోగించింది. దీంతో ఈ పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది.
భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది. పతకాల పట్టికలో 16వ స్థానంలో నిలిచింది. అయితే నవదీప్ సింగ్ బల్లెంని 47.32 మీటర్ల విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్ అథ్లెట్ బీత్ సయా సదేగ్ 47.64 మీటర్లు త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో సదేగ్ స్వర్ణ, నవదీప్ రజత పతక విజేతగా ప్రకటించారు.

కానీ ఇరాన్ అథ్లెట్ సదేగ్పై అనూహ్యంగా అనర్హత వేటు పడటంతో నవదీప్ సిల్వర్ మెడల్ పసిడి పతకంగా అప్గ్రేడ్ అయ్యింది. ఇక సిమ్రాన్ శర్మ 200 మీటర్ల టీ12 ఫైనల్లో రేసును 24.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో పతకాన్ని చేజార్చుకున్న సిమ్రన్ 200 మీటర్ల రేసులో సత్తాచాటింది. తన అత్యుత్తమ ప్రదర్శనతో భారత్కు పతకాన్ని అందించింది.
కాగా, 200 మీటర్ల టీ12 ఫైనల్ రేసులో క్యూబా అథ్లెట్ ఒమరా డ్యురండ్ ఎలియాస్ అగ్రస్థానంలో నిలిచింది. 23.62 సెకన్లలో పరుగును పూర్తి చేసి స్వర్ణం సాధించింది. వెనిజులా క్రీడాకారిణి అలెజాండ్రా పావోలా పెరెజ్ లోపెజ్ 24.19 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆమె రజతం అందుకుంది.