పారిస్ వేదికగా జరగుతున్న పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో శనివారం మరో రెండు పతకాలు చేరాయి. మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్య పతకం నెగ్గింది. జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు. అయితే నవదీప్ బల్లెంని 47.32 మీటర్ల విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్ అథ్లెట్ బీత్ సయా సదేగ్ 47.64 మీటర్లు త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు.
తొలుత సదేగ్ స్వర్ణ, నవదీప్ రజత పతక విజేతగా ప్రకటించారు. కానీ ఇరాన్ అథ్లెట్ సదేగ్పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. దీంతో నవదీప్ సిల్వర్ మెడల్ పసిడి పతకంగా అప్గ్రేడ్ అయ్యింది. అయితే ఇరాన్ అథ్లెట్ వేటు కారణమేంటో తెలిసింది. సదేగ్ తన విజయోత్సవ ర్యాలీలో ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న జెండాను ప్రదర్శించినట్లు సమాచారం.

దీంతో అనర్హత వేటుపై ఇరాన్ అప్పీలు చేసినా లాభం లేకపోయింది. పారాలింపిక్స్ కమిటీ సదేగ్పై వేటు వేసి రెండో స్థానంలో ఉన్న నవదీప్ సింగ్ను ఛాంపియన్గా ప్రకటించింది. కాగా, నవదీప్ పసిడి గెలవడంపై భారత పారా అథ్లెటిక్స్ ప్రధాన కోచ్ సత్యనారాయణ స్పందించారు.
''అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధలను ఇరాన్ అథ్లెట్ అతిక్రమించాడు. ఎవరూ రాజకీయ, మతపరమైన నినాదాలు చేయకూడదు. జాతీయ జెండాను తప్పించి మరే ఇతర పతాకాలను ప్రదర్శించకూడదు. అందుకే సదేగ్ అనర్హత వేటుకు గురి కావాల్సి వచ్చింది. ఇరాన్ అప్పీలుకు వెళ్లినా పారాలింపిక్స్ కమిటీ తిరస్కరించింది'' అని సత్యనారాయణ వెల్లడించారు.
కాగా, ఈ పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది. భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది. పతకాల పట్టికలో 16వ స్థానంలో నిలిచింది.