పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్, తెలుగమ్మాయి దీప్తి జీవాంజి పతకం దిశగా దూసుకెళ్తోంది. మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి ఫైనల్కు చేరింది. సోమవారం జరిగిన హీట్-1లో 55.45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచింది. రెండు హీట్స్ నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు, అలాగే ఫాస్టెస్ట్ టైమింగ్ నమోదు చేసిన మరో ఇద్దరితో కలిపి మొత్తం ఎనిమిది మంది అథ్లెట్లు ఫైనల్కు ఎంపికవుతారు.
కాగా, ఇవాళ రాత్రి 10.38కి ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్లో దీప్తి ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత ప్రపంచ రికార్డు (55.07 సెకన్లు) ఆమె పేరిటే ఉండటం విశేషం. మేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్లో ఈవెంట్లో దీప్తి ఈ వరల్డ్ రికార్డు సృష్టించింది. కాగా, దీప్తి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. ఆమె నిరుపేద కుటుంబంలో మేధోపరమైన బలహీనతతో జన్మించింది.

పరుగు పందెంలో రాణించిన దీప్తిని స్కూల్ పీఈటీ ప్రోత్సహించాడు.ఆ తర్వాత ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణతో ఆమె కథ మారిపోయింది. రమేశ్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో చేర్పించారు. ఆ తర్వాత శిక్షణలో దీప్తి రాటుదేలింది.
కోచ్ రమేశ్ శిక్షణతో, పుల్లెల గోపించంద్ అండతో ఆమె పారా అథ్లెట్గా పతకాల వేట కొనసాగిస్తోంది. ఆసియా పారా గేమ్స్ 400 మీటర్ల ఈవెంట్లో, వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలోనూ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించింది. వరల్డ్ చాంపియన్గా, వరల్డ్ రికార్డు హోల్డర్గా పారిస్ పారాలింపిక్స్లో బరిలోకి దిగింది.