పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతూ పతకాల మోత మోగిస్తున్నారు. ఈ విశ్వక్రీడల్లో పెట్టుకున్న 25 పతకాల లక్ష్యానికి అతి చేరువలో నిలిచారు. బుధవారం నాటికి భారత్ ఖాతాలో 24 పతకాలు సాధించింది. టోక్యోలో సాధించిన 19 పతకాలను రికార్డును బద్దలుగొట్టి మన అథ్లెట్లు నయాచరిత్ర లిఖిస్తున్నారు. బుధవారం భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకం సాధించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్ టీ-63 విభాగంలో శరద్ కుమార్ రజతం, తంగవేలు మరియప్పన్ కాంస్యం (1.85 మీటర్లు) సాధించారు. శరద్ కుమార్ 1.88 మీటర్లు, తంగవేలు 1.85 మీటర్ల ఎత్తు దూకారు. ఇక జావెలిన్ త్రోలో అజీత్ ఎఫ్-46 విభాగంలో రజతం, గుర్జర్ సుందర్ సింగ్ కాంస్యం గెలిచారు.

షాట్పుట్ ఎఫ్-46 విభాగంలో సచిన్ సర్జేరావు ఖిలారీ రజతం గెలిచాడు. 16.32 మీటర్ల దూరం గుండును విసిరి
సిల్వర్ కైవసం చేసుకున్నాడు. ఆర్చరీలో హర్విందర్ సింగ్ స్వర్ణం సాధించాడు. పురుషుల రికర్వ్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో పారాలింపిక్స్లో పసిడి నెగ్గిన తొలి భారత ఆర్చర్ హర్విందర్ చరిత్రకెక్కాడు.
మరోవైపు పురుషుల క్లబ్త్రో (ఎఫ్ 51)లో భారత స్వర్ణం, రజతం సాధించింది. ధరంబీర్ సింగ్ గోల్డ్, ప్రణవ్ సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు ధరంబీర్ 34.92 మీటర్ల త్రోతో, ప్రణవ్ 34.59 మీటర్లతో త్రోతో పతకాల మోత మోగించారు. కాగా, ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు కలిపి మొత్తంగా 24 పతకాలతో పట్టికలో 13వ స్థానంలో ఉంది. పతకాల పట్టికలో చైనా (135- 62 స్వర్ణాలు), గ్రేట్ బ్రిటన్ (74- 33 స్వర్ణాలు), అమెరికా (63- 25 స్వర్ణాలు), నెదర్లాండ్స్ (28- 16 స్వర్ణాలు) టాప్-4లో ఉన్నాయి.