విశ్వక్రీడలకు పారిస్ ముస్తాబైంది. మరో మూడు రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 16 క్రీడల్లో 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన ప్లేయర్లు పట్టుదలతో సిద్ధమయ్యారు. గత టోక్యో ఒలింపిక్స్లో సాధించిన ఏడు పతకాల కంటే మరిన్ని మెడల్స్ సాధించాలని కసిగా పారిస్ గడ్డపై అడుగుపెట్టారు.
నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా సమరంలో విజేతగా నిలవాలని క్రీడాకారులంతా తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. పోడియంపై నిల్చుని పతకాన్ని సాధించాలని గొప్పగా పోరాడుతుంటారు. ఒలింపిక్స్ మెడల్స్ కోసం ప్లేయర్లు పడే శ్రమ చూస్తుంటే.. పతకాలు ఎంత విలువైనవో ప్రేక్షకులకు అర్థమవుతుంటుంది. అయితే ఖరీదు పరంగా మెడల్స్లో అంత గొప్పేమి లేదు.

పారిస్ ఒలింపిక్స్లో ఇచ్చే స్వర్ణ పతకం విలువ రూ.62 వేల నుంచి రూ.71 వేల మధ్య ఉంటుంది. రజతం విలువ సుమారు రూ.37 వేల ఉంటుంది. ఇక కాంస్య పతకం విలువ చాలా తక్కువ. దీని తయారీ విలువ దాదాపు రూ. 500 మాత్రమే. మెడల్స్ తయారీ కూడా భిన్నంగా ఉంటుంది. బంగారు పతకంలో పూర్తిగా బంగారం ఉండదు. వెండితో సిద్ధం చేస్తారు. దానిపైనే బంగారు పూత పోస్తారు. మొత్తంగా గోల్డ్ మెడల్లో 92.5 శాతం వెండినే ఉపయెగిస్తారు. గోల్డ్ కేవలం 6 గ్రాములే ఉంటుంది.
రజత పతకంలో మాత్రం పూర్తిగా వెండిని ఉపయోగిస్తారు. ఇక కాంస్య పతకాన్ని రాగితో చేస్తారు. 95 శాతం రాగి, 5 శాతం జింక్తో కాంస్య పతకాన్ని తయారు చేస్తారు. అయితే పారిస్ ఒలింపిక్స్లో విజేతలకు ఈసారి ఇచ్చే పతకాలకు ఓ ప్రత్యేకత ఉంది. మెడల్స్లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఉక్కును కలుపుతున్నారు. కాగా, మెడల్స్ను ఖరీదు పరంగా విలువను ఎవరూ పరిగణించరు. విశ్వవేదికపై తమ దేశాన్ని విజేతగా నిలుపడమే అమూల్యంగా భావిస్తారు.