పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్కు దురదృష్టం వెంటాడుతోంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి గెలిచినప్పటికీ నిబంధనల కారణంగా భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ విజయాన్ని రద్దు చేశారు. దీంతో మిగిలిన మ్యాచ్ల్లో తప్పక సత్తాచాటాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతకుముందు శనివారం షూటింగ్లోనూ భారత్కు చుక్కెదురైన విషయం తెలిసిందే.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్కు చేరే అర్హత పాయింట్లు సాధించినప్పటికీ సరబ్జోత్ ఇన్నర్ టెన్స్ రూల్తో వెనుదిరగాల్సి వచ్చింది. ఎనిమిదో స్థానంలో నిలిచిన జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్తో సమానంగా మన షూటర్ 577 పాయింట్లు సాధించాడు. కానీ ఇన్నర్-10 నిబంధన మన కొంపముంచింది. కాగా, ఈసారి బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ విజయం నేలపాలైంది.

అసలేం జరిగిందంటే.. గ్రూప్ ఎల్లో ఉన్న లక్ష్య సేన్ గ్వాటెమాలా ఆటగాడు కెవిన్ కార్డన్తో శనివారం జరిగిన మ్యాచ్లో 21-8, 22-20తో ఘన విజయం సాధించాడు. వరుస సెట్లలో విజృంభించి గెలిచాడు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం కారణంగా కెవిన్ ఈ విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు. గ్రూప్ దశలో ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా నిష్క్రమిస్తే, ఆ సదరు ప్లేయర్ ఆడిన మ్యాచ్ల ఫలితాలతో పాటు ఆడాల్సిన మ్యాచ్లను పరిగణనలోకి తీసుకోరు.
దీంతో లక్ష్యసేన్ సాధించిన విజయం లెక్కలోకి రాలేదు. అతను అందుకున్న పాయింట్లను తొలగించారు. కాగా, లక్ష్య సేన్ ఇవాళ బెల్జియం ఆటగాడు జులియన్తో తలపడనున్నాడు. సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. బుధవారం ఇండోనేషియా ప్లేయర్ జొనాతన్ క్రిస్టీతో పోటీపడనున్నాడు. మరోవైపు మెన్స్ డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ మ్యాచ్ కూడా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మార్క్ లమ్స్ఫస్-మార్విన్ సీడెల్ జంటతో స్వాతిక్ జోడీ ఆడాల్సి ఉంది. కానీ మోకాలి గాయం కారణంగా మార్క్ టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్ను రద్దు చేశారు.