పారిస్ ఒలింపిక్స్-2024లో మొదటి రోజు భారత షూటర్లకు దురదృష్టం వెంటాడుతోంది. పతక పోరుకు అర్హత సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ విభాగంలో ఒక్క పాయింటుతో మెడల్ రేసుకు దూరమైన భారత్.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్కు చేరే అర్హత పాయింట్లు సాధించినప్పటికీ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.
శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ విభాగంలో 628.7 పాయింట్లతో అర్జున్ బబుతా-రమిత ఆరో స్థానంలో, వలరివన్-సందీప్ సింగ్ 623.6 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. అయితే నాలుగో స్థానంలో నిలిచిన జర్మనీ ద్వయానికి మనోళ్లకు మధ్య అంతరం ఒక్క పాయింటు మాత్రమే. మరో పాయింటు సాధించి ఉంటే భారత్ కాంస్య పతక పోరులో నిలిచేది.

కాగా, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ సరబ్జ్యోత్ 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరో షూటర్ అర్జున్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమయ్యాడు. టాప్ 8లో నిలిచిన వాళ్లు ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. అయితే ఎనిమిదో స్థానంలో నిలిచిన జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ కూడా సరబ్జ్యోత్తో సమానంగా 577 పాయింట్లే సాధించాడు.
కానీ సరబ్జ్యోత్ కంటే రాబిన్ ఒక్క ఇన్నర్-10ను ఎక్కువగా సాధించాడు. జర్మనీ షూటర్ 18 ఇన్నర్ టెన్స్ సాధించగా, మన షూటర్ 17 సాధించాడు. దీంతో షూటింగ్ నిబంధనల ప్రకారం ఇన్నర్ టెన్స్ ఎక్కువగా ఉన్న జర్మనీ షూటర్కు ఫైనల్స్కు అవకాశం ఇచ్చారు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్లో ఉన్న సరబ్జ్యోత్ తప్పక పతకం సాధిస్తాడనే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు.