పారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్లో బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్ మ్యాచ్లో ఎస్తేనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాపై 21-5, 21-10 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్కు చేరింది.
73వ ర్యాంకర్ క్రిస్టినా కూబాపై పదో సీడ్ సింధు ఆది నుంచి విరుచుకుపడింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటిలోనే మూడు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సింధు తిరిగి వెనక్కి చూడలేదు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్ను ఏకపక్షంగా మార్చింది. అదే జోరును రెండో గేమ్లోనూ కొనసాగించి రౌండ్-16కు చేరింది. మ్యాచ్ను 34 నిమిషాల్లోనే ముగించింది.

గ్రూప్-ఎమ్లో సింధు అగ్రస్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్ల్లో గెలిచి నాలుగు పాయింట్లు సాధించింది. తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్పై సింధు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. కేవలం 29 నిమిషాల్లోనే 21-9, 21-6తో మ్యాచ్ను ముగించింది.
కాగా, రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన సింధు ఈ విశ్వక్రీడల్లోనూ పతక లక్ష్యంగా బరిలోకి దిగింది. పారిస్ ఒలింపిక్స్లో సింధు పతకం సాధిస్తే .. ఒలింపిక్స్లో మూడు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కుతుంది. గత కొన్నాళ్లుగా తమ సామర్థ్యానికి తగ్గట్లుగా ప్రదర్శన చేయనప్పటికీ సింధు విశ్వక్రీడల్లో తిరిగి సూపర్ ఫామ్లోకి రావడం భారత్కు శుభసూచకం.