భారత్ స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కీలక వ్యాఖ్యలు చేశాడు. గత టోక్యో ఒలింపిక్స్ సమయంలో తనని విలన్గా చిత్రీకరించారని, దీంతో ఆమెకు జీవితంలో మరోసారి కోచింగ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాని చెప్పాడు. అయితే గతేడాది మను తన దగ్గరకు వచ్చి కోచింగ్ ఇవ్వమని అభ్యర్థించడంతో దేశం కోసం కాదనలేకపోయానని 'మైకేల్'తో జస్పాల్ రాణా తెలిపాడు.
హరియాణాకు చెందిన మను భాకర్ 2002లో ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపాల్. చిన్న వయసులోనే షూటింగ్ను కెరీర్గా ఎంచుకున్న మను బాకర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో ఓనమాలు నేర్చుకుంది. అయితే టోక్యో ఒలింపిక్స్లో మాత్రం వేరే కోచ్తో ఆమె బరిలోకి దిగింది. ఆ విశ్వక్రీడల్లో పేలవ ప్రదర్శన చేసింది.

విభేదాలతో రెండేళ్ల పాటు దూరంగా ఉన్న మను-జస్పాల్ గతేడాది తిరిగి కలుసుకున్నారు. కోచ్-శిష్యురాలు హిట్ కాంబోగా పారిస్ ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యారు. ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు, ప్రపంచ ఛాంపియన్షిప్లో జూనియర్ గోల్డ్ సాధించిన జస్పాల్కు షూటింగ్పై గొప్ప అవగాహన ఉంది. 2018 ఆసియా క్రీడలకు ముందు మను కోచ్గా జస్పాల్ బాధ్యతలు చేపట్టాడు.
జస్పాల్ రాణా కోచింగ్లో మను ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాల పంట పండించింది. కానీ టోక్యో ఒలింపిక్స్కు వివిధ కారణాలతో విడిపోయారు. ఆ ఒలింపిక్స్లో పేలవ ప్రదర్శనతో పాటు ఆ తర్వాత రెండేళ్లలో ప్రపంచకప్లో ఓ కాంస్యం, ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం మాత్రమే మను గెలవగలిగింది. దీంతో తన గురువు జస్పాల్ రాణా దగ్గరకు మను తిరిగొచ్చింది.
''2023లో మను నా దగ్గరకు వచ్చింది. మొదట తనకు కోచింగ్ తిరిగి ఇవ్వకూడదని అనుకున్నా. కానీ మను సంకల్పంతో కనిపించింది. ఆమె తన తల్లితో వచ్చి కోచింగ్ ఇవ్వమని అడిగింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నన్ను విలన్గా చిత్రీకరించారు. కాబట్టి తిరిగి బాధ్యతలు అందుకోవడం అంత సులువు కాదు. కానీ అంగీకరించాను. కోచ్గా నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆమెకు 7-8 ఏళ్లుగా శిక్షణ ఇచ్చాను. భారత్కు పతకం అందించడమే లక్ష్యంగా శ్రమించాను. పారిస్ ఒలింపిక్స్లో మను మరికొన్ని పతకాలు తప్పక సాధిస్తుంది '' అని జస్పాల్ రాణా అన్నాడు.