ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలవడమనేది అంత సులభం కాదు. దాని కోసం ఎంతో శ్రమించాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. ఈ పతకాన్ని ముద్దాడాలనేది ప్రతి ఒక్క అథ్లెట్ కు జీవత కల. అయితే గతేడాదే పారిస్ ఒలింపిక్స్ ముగిసిన సంగతి తెలిసిందే. కానీ ఈ పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన 100 మంది అథ్లెట్లు తమ పతకాలను వాపస్ చేశారు. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి, కష్టపడి గెలిచిన పతకాలను తిరిగిచ్చేశారు. అందుకు కారణం నాసిరకరం.
ఈ విశ్వక్రీడలు ముగిసి ఏడాది కూడా కాలేదు. తమకు అందజేసిన పతకాలు దారుణంగా పాడైపోయాయని అథ్లెట్లు వాపోతున్నారు. చాలావరకు మెడల్స్ పై ఉన్న లోహపు పూత చెదిరిపోయిందట. అందుకే పతకాలను తిరిగిచ్చేశారు అథ్లెట్లు. దీంతో పారిస్ ఒలింపిక్ పతకాలు నాసిరకంగా ఉన్నాయంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ
పతకాలు నాసిరకంగా ఉన్నాయంటూ వస్తోన్న విమర్శలపై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ స్పందించింది. పాడైపోయిన 2024 ఒలింపిక్ పతకాలను మార్చి కొత్తవి ఇస్తామని వెల్లడించింది. ఫ్రెంచ్ ప్రభుత్వ మింట్ పతకాలు తయారీ చేస్తుందని, నాణ్యతకు ఆ సంస్థే బాధ్యత వహిస్తుందని చెప్పుకొచ్చింది. త్వరలోనే వాటిని ఫ్రెంచి ప్రభుత్వ మింట్ రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానున్నట్లు చెప్పుకొచ్చింది.
ఖండించిన ఫ్రెంచి ప్రభుత్వ మింట్
పతకాలు లోపాభూయిష్టంగా ఉన్నట్లు వస్తోన్న విమర్శలను ఫ్రెంచి ప్రభుత్వ మింట్ తిప్పికొట్టింది. గత ఆగస్టు నుంచే నాసిరకంగా ఉన్న పతకాలను మార్ ఇచ్చినట్లు తెలిపింది.
పూర్తి బంగారంతో చేయరు
ఈ ఒలింపిక్స్లో 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేశారు. గోల్డ్ మెడల్ ను వెండితో రూపొందిస్తారు. దానిపై బంగారు పూత పోశారు. అందులో 92.5 శాతం వెండి ఉండగా, 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విలువ రూ.62 వేల నుంచి 71 వేల వరకు ఉంది. పూర్తిగా వెండితో చేసిన పతకం సుమారు రూ.37 వేలుగా ఉంటుంది. కాంస్య పతకంలో 95 శాతం రాగి ఉండగా, 5 శాతం జింక్ కలుపుతారు. దీని తయారీ విలువ రూ.500 ఉంటుంది. పైగా ఈ సారి తయారు చేసిన మెడల్స్ లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఉక్కును కలపడం విశేషం.